‘కేటీఆర్‌ది అధికార అహం’

28 Aug, 2019 14:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతాం అని మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు కదా ఎందుకు కట్టడం లేదు అని కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. గాంధీ భవన్‌లో ప్రెస్‌ మీటింగ్‌ పెట్టిన ఆయన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీరును తప్పుపట్టారు. తుమ్మిడి హెట్టి పర్యటనకు వెళితే విహార యాత్రకు వెళ్లారా? అని కేటీఆర్‌ ఎగతాళి చేశారని, సమస్యను చెపితే వినే ఓపిక లేకుండా మాపై విమర్శలు చేయడం దారుణమన్నారు. విహార యాత్ర కాదు.. సమస్య ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని, కేటీఆర్‌ అధికార అహంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతున్నప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావ్... తెలవకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఎవరు కట్టారో అడిగి తెలుసుకో అని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పచ్చ నోట్ల మీద ఆశ పెరిగి ప్రాజెక్టుల వ్యయం పెంచి కమిషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశావా?. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక టూరిజం ప్రాజెక్టు అని, జూరాల, అప్పర్ మానేరు, సింగూర్ డ్యామ్ ఎండి పోయాయని విమర్శించారు. తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని కోరారు.

మాజీ ఎంపీ వివేక్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఎంపీగా ఉన్నప్పుడు రైతుల కోసం ఏం చేశావ్. పార్లమెంటులో ఏమి మాట్లాడావ్ అని పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తుమ్మిడిహెట్టి దగ్గర శిలా పలకం వేసినప్పుడు ‘మేము డిమాండ్ చేస్తేనే అక్కడ ప్రాజెక్టు కడుతున్నారు’ అని వివేక్‌, హరీశ్‌రావు అన్నారు కదా... ఇప్పుడు ఎందుకు దానిపై మాట్లాడడం లేదని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఎంపీలుగా ఉన్నవారు దద్దమ్మలని మండిపడ్డారు. రాజకీయ పునరావాసం కోసమే వినోద్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి చేపట్టారని తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు డూప్‌ ఫైట్‌ చేసుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మాటలు చెప్పడం మానేసి చేతలు చూపించాలని అన్నారు.  కేంద్ర విచారణ సంస్థలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా వాటితో రాష్ట్రంలో జరిగే అవినీతిపై విచారణ జరిపించండి అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు