716 కళాశాలలకు... ఏదీ గుర్తింపు..? 

10 Mar, 2020 02:25 IST|Sakshi

ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో కనిపించని వివరాలు 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుకు ఇదే కీలకం 

2019–20 సంవత్సరం దరఖాస్తుల పరిశీలనకు తీవ్ర ఇబ్బందులు 

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం దరఖాస్తుల పరిశీలన ప్రహసనంగా మారింది. 2019–20 విద్యా సంవత్సరానికి గాను పలు కళాశాలలు ఇప్పటికీ యూనివర్సిటీ/బోర్డు గుర్తింపు పొందిన పత్రాలను సంక్షేమ శాఖలకు సమర్పించలేదు. ఏటా పునరుద్ధరీకుంచుకున్న తర్వాత వాటిని సంక్షేమశాఖ కార్యాలయంలో, ఈ–పాస్‌ వెబ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెందిన 716 కాలేజీలు ఇప్పటికీ గుర్తింపు/రెన్యువల్‌ పత్రాలను సమర్పించకపోవడం గమనార్హం. 

5,712 కళాశాలలకు లభించిన ధ్రువీకరణ.. 
రాష్ట్ర వ్యాప్తంగా 6,428 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, వృత్తివిద్యా కాలేజీలున్నాయి. ఇందులో అత్యధికంగా 2,888 ఇంటర్మీడియట్‌ బోర్డు గుర్తింపు పొంది ఉన్నాయి. 2019–20 విద్యా సంవత్సరానికి గాను అవన్నీ గుర్తింపు పత్రాలు సమర్పించాయి. మిగతా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కాలేజీల్లో చాలా వరకు గుర్తింపు పత్రాలను సమర్పించలేదు.కొన్ని ఈ–పాస్‌ వెబ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయి డాక్యుమెంట్లు సమర్పించని కారణంగా సంక్షేమ శాఖాధికారులు వాటిని ధ్రువీకరించలేదు.రాష్ట్రంలో 6,428 కాలేజీల్లో ఇప్పటివరకు కేవలం 6,120 మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. ఇందులో 5,712 మాత్రమే ధ్రువీకరణ పొందాయి. 

ఆ కాలేజీ విద్యార్థులకే ఫీజులు..
ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించేనాటికే గుర్తింపు పత్రాలు, రెన్యువల్‌ వివరాలను సంక్షేమ శాఖలకు సమర్పించాలి. అలాంటి వాటికే వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అప్పుడు ఆయా కళాశాలల విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.కానీ గుర్తింపు పత్రాల సమర్పణ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పూర్తి కావడం లేదని, పలు యూనివర్సిటీలు/ బోర్డులు వీటిని జారీ చేసేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నందున విద్యార్థుల దరఖాస్తుకు అనుమతి ఇవ్వాలని పలు కాలేజీల యాజమాన్యాలు కోరాయి.దీంతో స్పందించిన ప్రభుత్వం ఆమేరకు అవకాశం కల్పించింది.

2019–20 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 12.58లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.ఈ–పాస్‌ వెబ్‌ పోర్టల్‌లో ధ్రువీకరణ పొందిన కాలేజీ విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఇంకా ధ్రువీకరణ పొందని వాటి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. వాటిని అందుకున్న కళాశాలలు స్పందించి పత్రాలు సమర్పించకుంటే ఆ కాలేజీ విద్యార్థుల దరఖాస్తుల పరిశీలనను నిలిపివేస్తారు. మొత్తంగా అన్ని పత్రాలు సమర్పించిన కళాశాలల విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే పరిశీలించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు