‘పోస్టల్‌ స్కామ్‌’లో మరో ఇద్దరి అరెస్టు

10 Dec, 2016 03:09 IST|Sakshi

జ్యుడీషియల్‌ రిమాండ్‌కు సుధీర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: ‘నగదు మార్పిడి’ని క్యాష్‌ చేసుకున్న పోస్టల్‌ శాఖ అధికారి, సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌ (ఎస్‌ఎస్‌పీఓఎస్‌) కె.సుధీర్‌ బాబుకు దళారులుగా వ్యవహరించిన ఇద్దరిని సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న సుధీర్‌ గురువారం లొంగిపోయిన విషయం విదితమే. ఇతడిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించారు. లా విద్యార్థి టి.నితిన్, కొద్దికాలం ఆస్ట్రేలియాలో ఉండి వచ్చిన వి.నర్సింహ్మారెడ్డి తమ దందాలో దళారులుగా వ్యవహరించినట్లు బయటపెట్టాడు. దీంతో వీరిద్దరినీ  సీబీఐ అరెస్టు చేసింది.

హిమాయత్‌నగర్, కార్వాన్, గోల్కొండ పోస్టాఫీసులు కేంద్రంగా రూ.2.95 కోట్ల నగదు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సుధీర్‌ దళారుల సాయంతో కొందరు వ్యాపారులు, బడా బాబుల నుంచి కమీషన్‌ తీసుకుని వారి పాత కరెన్సీని మార్చి ఇచ్చినట్లు సీబీఐ అధికారులు తేల్చారు. దళారులుగా వ్యవహరించిన వారికీ సుధీర్‌బాబు కమీషన్‌ ఇచ్చినట్లు గుర్తించారు. సూత్ర ధారుల్ని గుర్తించడం కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. సుధీర్‌బాబును శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. లోతుగా విచారించడం కోసం న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు