రెవెన్యూ అధికారులను నియంత్రించండి : ప్రభాస్‌

20 Dec, 2018 01:16 IST|Sakshi

నా స్థలం విషయంలో జోక్యం చేసుకుంటున్నారు 

ఆ స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశా 

హైకోర్టును ఆశ్రయించిన సినీనటుడు ప్రభాస్‌

 పిటిషన్‌ను ధర్మాసనానికి బదిలీ చేసిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్‌ 5/3లో తనకు చెందిన 2,083 చదరపు అడగుల స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ సినీనటుడు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు హైకోర్టును ఆశ్రయించారు. తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ఆయన బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చూపారని ఆయన తెలిపారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదని వివరించారు. అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాక పిటిషనర్‌ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని తెలిపారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని, అందువల్ల వారిని నియంత్రించాలని ఆయన కోర్టును కోరారు.  

మరో ధర్మాసనం విచారణ జరుపుతోంది.. 
ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయ మూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్‌.శరత్‌కుమార్‌ స్పందిస్తూ.. ఈ మొత్తం వివాదం సివిల్‌ సూట్‌ (సీఎస్‌) 7, 14లకు సంబంధించిందని, దీనిపై మరో ధర్మాసనం విచారణ జరుపుతోందని వివరించారు. ఈ విషయా లతో తనకు సంబంధం లేదని, కావాలంటే కొద్దిసేపు విచారణను వాయిదా వేస్తానని, రిజిస్ట్రీ వద్దకు వెళ్లి విషయం తెలుసుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తిరిగి ఈ కేసు విచారణకు రాగానే శరత్‌ స్పందిస్తూ.. సీఎస్‌ 7, 14లకు సం బంధించిన కేసులు మరో ధర్మాసనం ముందున్నాయని, ఈ విషయాన్ని రిజిస్ట్రీ సైతం నిర్ధారించిందని చెప్పారు. దీంతో న్యాయమూర్తి తన ముందున్న ప్రభాస్‌ పిటిషన్‌ను ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమయంలో ప్రభాస్‌ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఈ వ్యాజ్యంపై విచారణ గురువారం జరిగేలా చూడాలని కోరారు. తాను అదే పని చేస్తున్నానంటూ న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను ధర్మాసనానికి బదిలీ చేశారు.   

మరిన్ని వార్తలు