మూగ వేదనకు... స్పందించిన ‘ప్రజావాణి’

10 Dec, 2019 03:52 IST|Sakshi

అనంతగిరి : మూగజీవాలకు వైద్యం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన ఓ రైతు.. లేగ దూడను ఆటోలో తీసుకుని వచ్చి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సోమవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ధారూరు మండలం కేరెళ్లికి చెందిన రాములుకు చెందిన ఆవు ఆదివారం లేగదూడకు జన్మనిచ్చింది.పుట్టిన కొద్ది సేపటికే చెంగున ఎగరాల్సిన దూడ చతికిలబడి పేగులు బయటకు ఉండటంతో రైతు గుండె కదిలిపోయింది.

వెంటనే పశు వైద్యాధికారులకు ఫోన్‌ చేస్తే వారు స్పందించలేదు. సోమవారం ఉదయం ఓ డాక్టర్‌ వచ్చి పరీక్షించినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనితో కలత చెందిన రాములు మరికొందరి సాయంతో ట్రాలీ ఆటోలో దూడను తీసుకుని.. కలెక్టరేట్‌కు వచ్చాడు. ప్రజావాణి కార్యక్రమంలో ఉన్న కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన పశు వైద్య జిల్లా అధికారులు దూడకు వికారాబాద్‌లోని పశువుల ఆస్పత్రికి తరలించి వైద్యం చేసి పంపించారు.     

మరిన్ని వార్తలు