ప్రభుత్వ చీఫ్‌ విప్‌తో ప్రకాశ్‌రాజ్‌ భేటీ

10 Mar, 2020 02:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌తో కలిసి సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ సోమవారం అసెంబ్లీ ఆవరణలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత పని నిమత్తం వినయ్‌ భాస్కర్‌ను కలిసేందుకు వచ్చినట్టు చెప్పారు. రాహుల్‌పై ఇటీవల జరిగిన దాడికి, ఈ భేటీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. రాహుల్‌పై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. పబ్‌కు వెళ్లడం తప్పుకాదని, దాడి జరగడం సరికాదని వ్యాఖ్యానించారు.

గొడవలు, భిన్నాభిప్రాయాలు ఉంటే మాట్లాడుకోవాలని.. సినిమా ఇండస్ట్రీ వాళ్లను ఎవరు పడితే వాళ్లు కొడతారా అని ప్రశ్నించారు. రాహుల్‌ పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. కాగా, ప్రకాశ్‌రాజ్‌తో భేటీకి సంబంధించి వినయ్‌ భాస్కర్‌ కూడా స్పందించారు. ఒక సినిమా వేడుకకు సంబంధించిన అంశంపై మాత్రమే తమ మధ్య చర్చ జరిగిందని, సినిమా షూటింగ్‌కు సంబంధించిన పనిమీద ప్రకాశ్‌రాజ్, రాహుల్‌ సిప్లిగంజ్‌ తనను కలిశారని వెల్లడించారు. రాహుల్‌తో పబ్‌లో జరిగిన గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు