ప్రసవం చేశారు.. ప్రాణం తీశారు

7 Feb, 2018 10:34 IST|Sakshi
మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు, రమ(ఫైల్‌)

మూడు నెలలుగా చికిత్స పొందుతూ బాలింత మృతి

ప్రసవం అయినప్పటి నుంచి రక్తస్రావం 

ఆ తర్వాత పలు ఆస్పత్రుల్లో వైద్యం 

ప్రసవం సరిగా చేయలేదని బంధువుల ఆరోపణ  

జమ్మికుంట మమత ఆస్పత్రి ఎదుట ఆందోళన 

రూ. 14 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం 

జమ్మికుంట(హుజూరాబాద్‌): వివాహమైన ఐదేళ్లకు సంతానయోగం కలిగింది. తల్లివారింటికి వచ్చి స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది. గతేడాది అక్టోబర్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఏమైందో ఏ మోకానీ.. తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆరోగ్యం విషమించడంతో పలు ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. రూ. లక్షలు ఖర్చుపెట్టినా ఫలితం లేకుండా పోయింది. తన బిడ్డను చూడకుండానే.. మనసారా ముద్దాడకుండానే ఆ తల్లి కన్నుమూసింది.. ప్రసవం చేసిన వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ కుటుంబ సభ్యులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.  

రమ భర్త అశోక్‌ వివరాల ప్రకారం..  
వీణవంక మండలం నర్సింగపూర్‌కు చెందిన పోతరవేన కనకయ్య కూతురు రమ(26)కు మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్‌కు చెందిన బోయిన అశోక్‌తో 2012లో వివా హమైంది. 2017లో గర్భం దాల్చింది. నర్సింగపూర్‌లో ఉంటూ జమ్మికుంటలోని మమత ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంది. అక్టోబర్‌ 29న నొప్పలు రావడంతో ఆస్పత్రిలోచేరింది. 30న మగబిడ్డకు జన్మనిచ్చింది.

రక్తస్రావంతో పరిస్థితి విషమం.. 
ఆపరేషన్‌ సమయంలో తీవ్ర రక్తస్రావంకావడంతో  రమ ఆరోగ్యం విషమించింది. 31న ఆస్పత్రి డాక్టర్‌ సుధాకర్‌రావు తన కారులో హన్మకొండలోని మాక్స్‌కేర్‌ ఆస్పత్రికి తరలించాడు. నవంబర్‌ 25వరకు అక్కడే చికిత్స పొందింది. డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకెళ్లగా గుండెలో సమస్య తలెత్తింది. దీంతో జనవరి 23న మ్యాక్స్‌కేర్‌ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. 

‘మమత’ వైద్యులే కారణం అంటూ.. 
తన భార్య రమకు ఆపరేషన్‌ చేసే సమయంలో వైద్యు లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అనారోగ్యానికి గు రైందని ఈ నెల 1న మమత ఆస్పత్రి ఎదుట రమ భర్త అశోక్‌ బంధువులతో కలిసి ఆందోళనకు దిగాడు. దీంతో డాక్టర్‌ సుధాకర్‌రావు రమను హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. 

మృతదేహాంతో ఆందోళన 
రమ మృతదేహాన్ని నేరుగా జమ్మికుంటలోని మమత ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి ఎదటు శవంతో ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలంటూ డిమా ండ్‌ చేశారు.పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు.

రూ. 14 లక్షలకు ఒప్పందం  
ఆస్పత్రి ఎదుట ఆరుగంటల పాటు ఆందో ళన చేయడంతో పోలీసులు సర్ధిచెప్పేందుకు యత్నించారు. పోలీసు స్టేషన్‌లో ఆరువర్గాలు చర్చించుకున్నారు. మృతురాలి కుటుం బానికి రూ.14 లక్షలు ఇచ్చేందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది. 

మరిన్ని వార్తలు