విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి 

23 Feb, 2018 01:51 IST|Sakshi
యమున

ప్రేమించాలంటూ నిత్యం వేధింపులు 

బోనకల్‌: విద్యార్థినిపై ఓ ప్రేమో న్మాది కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం ఖమ్మం జిల్లా బోనకల్‌ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోలా వెంకటేశ్వర్లు కుమారుడు రామలింగయ్య.. అదే గ్రామానికి చెందిన మన్నెం అంజయ్య కూతురు యమునను ప్రేమిస్తున్నానంటూ నిత్యం వేధిస్తున్నాడు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమెను గతంలోనూ తరచూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ విషయమై ఆమె తల్లిదండ్రులు 2017, డిసెంబర్‌ 18న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. రిమాండ్‌కు వెళ్లిన అతను బెయిల్‌పై వచ్చి మళ్లీ వెంట పడటం ప్రారంభించాడు.

దీంతో యమున తల్లిదండ్రులు యమునను కళాశాల మాన్పించి యాదగిరిరెడ్డిపల్లిలోని తమ బంధువుల ఇంటికి పంపించారు. ప్రస్తుతం ఇంటర్‌ పరీక్షలు దగ్గర పడటంతో ఆమె ఇంటికి వచ్చింది. విషయం తెలుసుకున్న రామలింగయ్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి వెళ్లి గడియ పెట్టాడు. యమునను కత్తితో ఛాతి, కడుపులో పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు తలుపులు తెరిచి చూడగా.. వారిని చూసి పారిపోయాడు. బాధితురాలిని వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు