సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన పలువురు సినీ ప్రముఖుల డ్రగ్స్ వినియోగం, విక్రయం కేసులో ఎక్సైజ్ సిట్ చార్జి షీట్ వేసేందుకు సిద్ధమైంది. కోర్టు నుంచి అందిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సిట్ అధికారులు చార్జిషీట్ రూపొందిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో దీన్ని కోర్టుకు సమర్పించనున్నారు.
సిట్ విచారించిన వారిలో పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, చార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు తదితరులు ఉన్నారు. విచారణలో ముగ్గురు సినీ ప్రముఖుల నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించిన అధికారులు వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపారు. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక అందడంతో ఇద్దరు ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందనే ప్రచారం జరుగుతోంది. కానీ సిట్ అధికారికంగా దీన్ని ధ్రువీకరించలేదు.