‘ప్రజంటేషన్’తో బాధ్యత పెరిగింది: హరీశ్

10 Apr, 2016 04:46 IST|Sakshi
‘ప్రజంటేషన్’తో బాధ్యత పెరిగింది: హరీశ్

రీ డిజైనింగ్‌పై మంత్రుల సంఘం సుదీర్ఘ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో నీటిపారుదల అధికారులపై బాధ్యత పెరిగిందని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. లక్ష్యాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శనివారం సచివాలయంలో హరీశ్ అధ్యక్షతన మూడోసారి సమావేశమైంది. ఐదున్నర గంటల పాటుసాగిన ఈ భేటీలో కమిటీ సభ్యులైన ఆర్థిక మంత్రి ఈటల, రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల పాల్గొన్నారు.

డిజైన్ మార్పులతో ప్యాకేజీలవారీగా, ప్రాజెక్టులవారీగా తలెత్తే ఆర్థిక, న్యా య, సాంకేతిక చిక్కులపై చర్చించారు. రీ ఇంజనీరింగ్‌తో పెరిగే ఆయకట్టు, పాత కాంట్రాక్టు సంస్థల పనితీరును అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రీ ఇంజనీరింగ్ వల్ల ప్రాణహిత- చేవెళ్లకు సంబంధించిన 18 ప్యాకేజీలు, దేవాదుల ఫేజ్ 3లోని 2, 3 ప్యాకేజీలు, సీతారామ ప్రాజెక్టు, కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ స్థలం మార్పు, ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, గండిపల్లి, గౌరవల్లి రిజర్వాయర్లపై చర్చ జరిగింది. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే దిశగా అధికారులకు కమిటీ పలు సూచనలు చేసింది. నీటిపారుదల రంగానికి కేటాయిం పులు వచ్చే బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లకు పెరగవచ్చని హరీశ్ అన్నారు.

>
మరిన్ని వార్తలు