రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదు: డీజీ వీకే సింగ్‌

24 Jul, 2019 13:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రిటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీ వీకే సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఓ మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తాను తీసుకొచ్చే మిషన్‌ పాలసీలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తెలిపియన ఆయన.. ప్రజలకి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. జైళ్ల శాఖలో విధులు నిర్వర్తించిన సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం తనను స్టేషనరీ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగంలో చేయడానికి పని లేదని.. దీనిని మూసివేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. ఈ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వానికి రూ. 50 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇక్కడ పనిచేసే వాళ్లు ఉన్నా.. వారికి రోజుకు 2 గంటలు మాత్రమే పని ఉంటుందన్నారు.

జైళ్ల శాఖలో పనిచేసిన కాలంలో ఆనంద ఆశ్రయం ఏర్పాటు చేసి 15 వేల మంది బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించినట్టు చెప్పారు. సర్వీస్‌లో బదిలీలు సాధారణం అని అన్నారు. సరైన పోస్టింగ్‌ ఇవ్వకపోవడంతో తాను రాజకీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సరైన పోస్టింగ్‌ ఇవ్వకపోతే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. ఎక్కడ పోస్టింగ్‌ ఇచ్చిన ప్రజలకు సేవ చేస్తానని వెల్లడించారు. జైళ్ల శాఖలో అవినీతి చేయడంతోనే తనను బదిలీ చేశారనే ప్రచారం అవాస్తవం అని తెలిపారు. కావాలంటే తనపై విచారణ చేపట్టవచ్చన్నారు. ఇప్పుడు తాను రాజీనామా చేస్తే అనేక ఆరోపణలు వస్తాయని పేర్కొన్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్‌ శాఖలో నార్త్‌ ఆఫీసర్స్‌కు ప్రాముఖ్యత లేదనిది వాస్తవం కాదని.. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా తాను ఖండిస్తున్నట్టు తెలిపారు. కాగా, చాలా కాలంగా జైళ్ల శాఖలో పనిచేస్తున్న వీకే సింగ్‌ను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు