కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన జైలు అధికారులు..?
కుషాయిగూడ : ‘జస్టిస్ ఫర్ దిశ ’హత్య కేసు నిందితుల చిత్రాలు వివిధ మాధ్యమాల్లో హల్చల్ చేయడంపై జైళ్లు, పోలీసు శాఖల అధికారులు ఆగ్రహం వ్యక్తపరిచారు. నిందితులను శనివారం రాత్రి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం విదితమే. వారు జైలుకు వచ్చిన సమయంలో జైలు అధికారులు వారి వివరాలు నమోదు చేసుకుంటున్న సందర్భంలో నిందితులను నేరుగా చిత్రీకరించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ, ప్రధాన మీడియాలోను హల్చల్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై జైళ్లశాఖ, పోలీసు అ«ధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించిన జైలు అధికారులు ఓ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. దీనిపై జైళ్లశాఖ అధికారులను వివరణ కోరగా వీడియో చిత్రీకరణ వాస్తవమేనని, దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించిన తరువాత శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.