ట్రాన్స్‌కోలో ఇష్టారాజ్యం 

6 Apr, 2019 12:26 IST|Sakshi
మద్నూర్‌లో ప్రైవేటు వ్యక్తితో  రిపేర్‌ చేయిస్తున్న ట్రాన్స్‌కో అధికారులు

సాక్షి, మద్నూర్‌(జుక్కల్‌): తెలిసీ తెలియని పనులు చేస్తే ఉద్యోగం నుంచి తీసి వేస్తారు.. మళ్లీ వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు.. అయితే విద్యుత్‌ శాఖలో మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. కొద్దిపాటి నిర్లక్ష్యం చేసిన ప్రాణాల హరీమనడం ఖాయం. మండలలోని ట్రాన్స్‌కో అధికారులు స్థానికంగా ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాన్స్‌కో లైన్‌మెన్లు, సిబ్బంది ప్రైవేట్‌ వ్యక్తులకు పెట్టుకుని వారితో పనులు చేపించుకుని కొంత డబ్బు ముట్టజెప్పుతున్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రైవేటు వ్యక్తులే సమస్యలను పరిష్కరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండి, ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించరాదు.

జిల్లాకు సరిహద్దులో ఉన్న మద్నూర్‌ మండలంలో ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల పర్యవేక్షణలు లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మండల కేంద్రంలో విద్యుత్‌ లైన్‌కు ప్రైవేటు వ్యక్తితో మరమ్మతులు చేయించడం చూసి గ్రామస్తులు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో లైన్‌మెన్, క్యాజువల్‌ లెబర్, ట్రాన్స్‌కో సిబ్బంది దగ్గరుండి మరి పనులు చేపించడం దారుణమని పలువురు మండిపడుతున్నారు. గతంలో ట్రాన్స్‌కోలో ప్రైవేటు సిబ్బంది పనిచేస్తూ ప్రమాదల బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. ఉపాధి కోసం, ట్రాన్స్‌కోలో ఉద్యోగం కోసం పని నేర్చుకుంటుమన్నామని ప్రైవేటు వ్యక్తులు చెబుతున్నారు. ట్రాన్స్‌కో జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

 

మరిన్ని వార్తలు