మార్గదార్శకాలు బేఖాతరు!

27 Jun, 2020 01:49 IST|Sakshi

కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఫీజుల దందా

రూ. లక్షల్లో దండుకుంటున్నట్లు ఆరోపణలు

ఇళ్లలో చికిత్సకు ససేమిరా.. బాధితుల గగ్గోలు

పలు డయాగ్నస్టిక్‌ సెంటర్లలోనూ భారీగా వసూళ్లు

సిబ్బందికి అత్తెసరు జీతాలు.. పనికి నర్సులు నో

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు రంగంలోనూ కరోనా పరీక్షలు, చికిత్సలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని ఆసరాగా చేసుకొని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అందినకాడికి దండుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పలువురు బాధితులు మండి పడుతున్నారు. తీవ్ర వ్యాధి లక్షణాలు లేని కరోనా పాజిటివ్‌ వ్యక్తులు ఇళ్లలోనే ఉండి చికిత్స పొందొచ్చని ప్రభుత్వం పేర్కొన్నప్ప టికీ కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు ఫీజుల కోసం రోగులను భయపెట్టి మరీ అడ్మిట్‌ చేసుకుంటు న్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల ఓ కరోనా రోగికి చికిత్స అందించిన ఒక కార్పొరేట్‌ ఆస్పత్రి.. డిశ్చార్జి సమయంలో రూ.7.5 లక్షల బిల్లు వసూలు చేసి నట్లు తెలిసింది. మరో వైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రారంభించిన 50 వేల కరోనా టెస్టుల ప్రత్యేక డ్రైవ్‌కు ప్రభుత్వం రెండు రోజుల విరామం (శాంపిళ్ల ఫలితాలు పెండింగ్‌లో ఉండటంతో) ప్రకటించడంతో కరోనా లక్షణాలున్న వారు ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో కొన్ని డయాగ్నస్టిక్‌ సెంటర్లు వసూళ్లకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వస్తు న్నాయి. డబ్బు గుంజినా శాంపిళ్లు మాత్రం తీసుకోకుండా టోకెన్లు ఇస్తూ మర్నాడు రమ్మని చెబుతున్నట్లు బాధితులు చెబుతున్నారు.

పడకలు లేవంటూ అసత్య ప్రచారం...హైదరాబాద్‌ సహా కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా లక్షణాలతో ప్రజలు పోటెత్తుతున్నా వైద్యులు, సిబ్బంది కొరత వల్ల చికిత్సలో జాప్యం చోటుచేసుకుంటోంది. దీన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకొనేందుకు కొన్ని ఆస్పత్రులు ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. కరోనా వార్డుల్లో పడకలున్నా అవన్నీ నిండిపోయాయని అసత్య ప్రచారం చేస్తూ అధిక మొత్తం ఇచ్చేందుకు ముందుకొచ్చే వారికి చికిత్స అందిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. 

తక్కువ జీతాలకు పనిచేయలేమంటూ...
మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సిబ్బందికి తక్కువ జీతాలు ఇస్తుండటంతో కరోనా వార్డుల్లో వైద్య సేవలు అందించేందుకు చాలా మంది నిరాకరిస్తు న్నారు. వారిలో కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేసి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. హైదరాబాద్‌ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సులు కరోనా విధులు చేయలేమంటూ శుక్రవారం ఆందోళనకు దిగినట్లు తెలిసింది. దీంతో ఆగమేఘాల మీద ఎం తైనా ఇచ్చి పలుచోట్ల నుంచి నర్సులను రప్పించేం దుకు యాజమాన్యం ప్రయత్నాలు మొదలు పె ట్టింది. జూబ్లీహిల్స్‌లో పేరు మోసిన కార్పొరేట్‌ ఆస్పత్రిలోనూ 300 మంది నర్సుల అవసరం ఉన్నా ఎవరూ ముందుకు రావట్లేదు. ఈ నేపథ్యం లో ఆ ఆస్పత్రి స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టులు, నర్సింగ్‌ సూపర్‌వైజర్లు, క్వాలిటీ ఎగ్జిక్యూటివ్‌లు సహా 13 రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నర్సులకు సీనియారిటీ ఆధారంగా రూ. 35 వేల నుంచి రూ. 45 వేల వరకు జీతం ఇస్తామని పేర్కొంది. మరికొన్ని ఆస్ప త్రులైతే అవసరాన్ని బట్టి రూ. 50 వేలకు పైగా ఇచ్చేందుకు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రభు త్వ ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులకు, ఇతర పారా మెడికల్‌ సిబ్బందికి భారీ వేతనాలు ఉండటం, కరోనా బీమా కూడా ఉండటంతో పనిచేస్తున్నా రని, కానీ ప్రైవేటులో అటువంటి పరిస్థితి లేకపో వడంతో వైద్య సిబ్బంది వెళ్లిపోతున్నారని ఒక నర్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధి వ్యాఖ్యానించారు. మరోవైపు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కొంద రు వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో విధులకు వచ్చే వారి సంఖ్య తగ్గినట్లు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు