బండను ఢీకొన్న ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు

21 Sep, 2018 02:15 IST|Sakshi

ఊడిన ముందు చక్రం.. తృటిలో తప్పిన ప్రమాదం

బస్సులో 45 మంది విద్యార్థులు

దంతాలపల్లి (డోర్నకల్‌): ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు అదుపు తప్పి బండను ఢీకొనడంతో ముందు చక్రం ఊడింది. దీంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. దంతాలపల్లిలోని సెయింట్‌ మేరీస్‌ హైస్కూల్‌ బస్సు రోజువారీగా గురువారం సుమారు 45 మంది విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరింది.

బొడ్లాడ గ్రామ శివారులో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పెద్ద బండను ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు చక్రం ఊడి దెబ్బతిన్నది. డ్రైవర్‌ ప్రవీణ్, క్లీనర్‌తో సహా నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బస్సులో నుంచి విద్యార్థులను కిందికి దింపారు. దుబ్బతండాకు చెందిన విద్యార్థి రాంచరణ్‌ భుజానికి బలంగా దెబ్బ తగలడంతో చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు