తల్లిదండ్రులను వణికిస్తోన్న ప్రైవేటు స్కూలు ఫీజులు

18 Jun, 2019 12:58 IST|Sakshi
బుక్‌స్టాల్‌లో విద్యా సామగ్రి కొనుగోలు చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు 

సాక్షి, తాడూరు(నాగర్‌ కర్నూలు): ఈనెల 12నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో తల్లిదండ్రులకు టెన్షన్‌ ప్రారంభమైంది. పిల్లలను ఏ కళాశాలలో, ఏ పాఠశాలలో చేర్పించాలన్న తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. కాగా, ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలంటే వేలకు వేలు ఫీజులు ఉండడంతో తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. పాఠశాల అడ్మిషన్‌ ఫీజుతో పాటు వారికి కావాల్సిన ఇతర సామగ్రిని కలుపుకొని రెండింతలు కావడంతో అయోమయంలో పడిపోతున్నారు.

వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.  యూనిఫామ్స్, బ్యాగులు, పుస్తకాలు, బూట్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులు సంసిద్ధం అవుతున్నారు. దీంతో స్టేషనరీ, జనరల్, రెడీమేడ్‌ దుస్తులు, పాదరక్షల దుకాణాలు, విద్యా సంబంధిత వస్తు సామగ్రి దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇంగ్లిష్, తెలుగు మీడియం అయినా యూనిఫామ్‌ తప్పని సరి.

పోటాపోటీగా ప్రచారం 
ప్రైవేట్‌ పాఠశాలలో పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. పిల్లలను స్కూల్‌ చేర్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలో ఫీజులు అధికంగా ఉన్నా దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు విధిగా యాజమాన్యాలు నిర్దేశించిన యూనిఫామ్‌ ధరించాలి.

దీనికి తోడు విద్యా సామాగ్రి, ధరలు అధికంగా ఉన్నాయి. స్కూల్‌ బ్యాగ్స్, యూనిఫామ్, నోట్‌ పుస్తకాలు, విద్యా సామాగ్రి విద్యార్థుల తల్లిదండ్రులు కొనుగోలు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా పాఠశాలలో చేర్పించే క్రమంలో నిమగ్నమయ్యారు. చిన్నారుల విద్య కోసం బడ్జెట్‌  వేసుకొని విద్యా సామాగ్రి కొనుగోలు చేసుకుంటున్నారు.  

ఫీజుల మోత 
ప్రైవేట్‌ పాఠశాలలో నర్సరీకి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఫీజులు ఉన్నాయి. ఎల్‌కేజీ, యూకేజీ, 1వ తరగతి ఇలా తరగతుల వారిగా రూ.5వేల చొప్పున ఫీజులు పెరుగుతున్నాయి. దీనికి తోడు పుస్తకాలు, ఇతర వాహనాల చార్జీలు కలుపుకుంటే ఫీజులు కట్టడానికి మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి పాఠ్య పుస్తకాలు, ఎమ్మార్సీ భవనానికి చేరుతున్నాయి.  

అనుమతి లేని విద్యాసంస్థలతో ఇబ్బందులు 
మండలంలో అనుమతులు లేని పాఠశాలలపై అధికారులు దృష్టి సారించి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండా విద్యార్థులను చేర్చుకోవడం, వారిని తిరిగి ఇతర పాఠశాలలో చేర్పించే సమయంలో రికార్డు సీట్స్, టీసీలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం ఆడిండే ఆట, పాడిందే పాటగా మారింది. ప్రైవేట్‌ యాజమాన్యాలను నియంత్రించే దిశలో అధికారులు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ధరలు పెరిగాయి 
పెరిగిన విద్యా సామగ్రి ధరలను తట్టుకోలేకపోతున్నాం. వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగించే తమకు విద్యా సామాగ్రి కొనుగోలు పిల్లల చదువు విషయంలో ప్రతి పైసా బేరీజు వేసుకుంటూ నిర్ణయం తీసుకుంటాం. మాలాంటి కుటుంబాలకు చదువు భారంగా మారుతుంది.  
– శ్రీశైలం, గుంతకోడూరు 

ఫీజులు నియంత్రించాలి 
ప్రైవేట్‌ పాఠశాలలో అధిక మొత్తంలో ఫీజలు వసూలు చేస్తున్నారు. వాటిని నియంత్రించాలి. ప్రభుత్వ పాఠశాలలో సకాలంలో యూనిఫామ్స్, పుస్తకాలు పంపిణీ చేయాలి. అధికారులు సకాలంలో పాఠశాలలో మౌలిక వసతులపై స్పందించాలి.  
– కురుమూర్తి, తాడూరు 

మరిన్ని వార్తలు