ముగిసిన కాశీం విచారణ

19 Jan, 2020 14:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ చింతకింద కాశీం అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌ విచారణ ముగిసింది. విచారణ నిమిత్తం ఆయనకు న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాశీంను సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. కాశీం అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్ నివాసంలో ఆదివారం ఉదయం కాశీంను పోలీసులు హాజరుపరిచిన విషయం తెలిసిందే. అనంతరం ఈ పిటిషన్‌పై ఆయన నివాసంలోనే విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రఘునాథ్‌ వాదనలు వినిపించారు. (ఓయూ ప్రొఫెసర్‌ కాశిం అరెస్టు)

విచారణ అనంతరం ఆయన న్యాయవాది మాట్లాడుతూ.. ‘ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌పై హెబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసాం. కోర్టు ఆదేశాల మేరకు చీఫ్ జస్టీస్ ముందు హాజరు పరిచారు. కశీం ఇంటిపై సోదాలు చేసి అరెస్ట్ చేసిన విధానంపై వాదనలు వినిపించాము. 2016 లో నమోదైన కేసును ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు జరపలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ఈ మధ్య కాలంలో ప్రజా సంఘాల నేతలు, మావోయిస్టు సానుభూతి పరులపై అక్రమ అరెస్ట్‌లకు సంబంధించిన వివరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చాము.’ అని తెలిపారు.
 

మరిన్ని వార్తలు