ఆ విషయంలో ఇంకా క్లారిటీ లేదు : కోదండరాం

12 Nov, 2018 18:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. సోమవారం మీడియా చిట్‌చాట్‌లో భాగంగా... రేపు టీజేఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎనిమిది లేదా అంత కన్నా ఎక్కువ స్థానాల్లో టీజేఎస్‌ పోటీచేసే అవకాశం ఉందని తెలిపారు. కామన్ సింబల్ కాకుండా తమ అగ్గిపెట్టె గుర్తుతోనే పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. బూత్ కమిటీలతో సింబల్ గురించి విస్తృత ప్రచారం చేస్తామని వెల్లడించారు.

ఇంకా మాట్లాడుతూ.. మహాకూటమిని నిలబెట్టడానికి ఉమ్మడి ఎజెండాను కూడా మంగళవారమే ప్రకటిస్తామని కోదండరాం వ్యాఖ్యానించారు. మహాకూటమి కలిసి కట్టుగానే అందరితో పోటీ చేస్తుందని.. ఇందులో భాగంగా ప్రజా ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీపీఐని కూడా కలుపుకొని వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. కాగా మహాకూటమి అభ్యర్థిగా జనగామ నుంచి కోదండరాం పోటీచేయనున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు