పాత వాహనాలకు కాలం చెల్లు! 

12 Dec, 2017 03:25 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, తుమ్మల జూపల్లి, ఇంద్రకరణ్‌రెడ్డి

     పదిహేనేళ్లు దాటిన వాహనాలపై నిషేధం 

     తాగి వాహనం నడిపేవారిపై మరిన్ని కఠిన చర్యలు 

     రోడ్డు భద్రత మంత్రివర్గ ఉపసంఘం తొలిభేటీలో చర్చ 

     వచ్చే నెల మలిదఫా సమావేశంలో ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: పదిహేనేళ్లు దాటిన వాహనాలు రోడ్డు ఎక్కకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలం చెల్లిన వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నందున వాటి విషయంలో అలసత్వం సరికాదన్న నిపుణుల సూచనతో ఏకీభవించింది. అలాగే మద్యం తాగి నడిపేవారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. రహదారి భద్రతపై ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నా రు. వచ్చే నెలలో జరగనున్న మలిదఫా సమా వేశంలో వీటిపై ప్రకటన చేయనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో కమిటీ సభ్యులు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, పి.మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతోపాటు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రైల్వే పోలీసు డీజీ కృష్ణప్రసాద్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్, జాతీయ రహదారుల విభాగం ఈఎన్‌ సీ గణపతిరెడ్డి, రాష్ట్ర రహదారుల ఈఎన్‌సీ రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

ప్రమాదాలను తగ్గించేందుకు.. 
వాహన ప్రమాదాలు, వాటి రూపంలో ఏటా సగటున ఏడు వేల మంది మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణించి రోడ్డు భద్రతను ఎలా పటిష్టం చేయాలో సిఫారసు చేసేందుకు సీఎం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కొన్ని నిర్దిష్ట సూచనలు చేసే బాధ్యతను కమిటీ.. జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ లక్ష్మణరావు, ఓయూ ప్రొఫె సర్‌ ఎం.కె.కుమార్, వరంగల్‌ నిట్‌ ప్రొఫెసర్‌ ప్రసాద్, ఇండియన్‌ ఫెడరేషన్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ ప్రతినిధి వినోద్, రోడ్‌సేఫ్టీ క్లబ్‌ ప్రతినిధి పి.శ్రీనివాస్‌ తదితరులకు అప్పగించింది. ఈ సమావేశంలో వారంతా పాల్గొని తమ సూచనలిచ్చా రు. మద్యం తాగి వాహనం నడిపే వారిపై, నిబంధనలు పాటించని వారి విషయంలో కఠిన చర్యలు, డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ నిబంధనలు, వేగ నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. వచ్చే జనవరి తొలివారంలో రహదారి భద్రతావారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇçప్పుడు తీసుకున్న నిర్ణయాలపై మలిదఫా సమావేశంలో చర్చించి ప్రకటించనున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు.  

ఈ ఏడాది మృతుల సంఖ్య 5,931.. 
2015లో 21,552 ప్రమాదాల్లో 7,110 మృతిచెందగా, 2016లో 22,811 ప్రమాదాల్లో 7,219 మంది, ఈ సంవత్సరం నవంబర్‌ వరకు 20,0172 ప్రమాదాలు చోటు చేసుకోగా 5,931 మంది చనిపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని మంత్రి తుమ్మల వెల్లడిం చారు. మృతుల సంఖ్య స్వల్పంగా తగ్గినంత మాత్రాన దీన్ని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. దేశంలో రోడ్డు భద్రత చర్యలు పాటిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా పోలిస్తే బాగా వెనకబడిన విషయాన్ని మరవవద్దని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు