42 మందికి డీఎస్పీ పదోన్నతులు!

20 Aug, 2018 01:04 IST|Sakshi

జాబితాకు ఆమోదముద్ర వేసిన డీపీసీ మరికొందరికి కూడా ప్రమోషన్లు లభించే చాన్స్‌  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో 1995 బ్యాచ్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషనల్‌ కమిటీ (డీపీసీ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. రెండు రోజులుగా భేటీ అవుతూ వచ్చిన డీపీసీ...సంబంధిత అధికారుల ట్రాక్‌ రికార్డును పరిశీలించింది. 1995 బ్యాచ్‌కు చెందిన 42 మందికి డీఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ఆమోదముద్ర వేసినట్లు రాష్ట్ర పోలీస్‌శాఖ ముఖ్య కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

డిప్యుటేషన్, లూప్‌లైన్‌లో రెండేళ్లపాటు పనిచేయని వారికి పదోన్నతి కల్పించకుండా చూడాలంటూ ఇటీవల కొందరు ఇన్‌స్పెక్టర్లు హైకోర్టుకెక్కగా వారి పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో పోలీస్‌శాఖ పదోన్నతుల వ్యవహారాన్ని వేగవంతం చేసి డీపీసీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ తీసుకుంది. మంగళ లేదా బుధవారం పదోన్నతుల జాబితా వెలువడొచ్చని తెలిసింది. 1995 బ్యాచ్‌లోని మరికొందరి పేర్లనూ పదోన్నతుల కోసం డీపీసీ ముందుకు పోలీస్‌శాఖ పంపనున్నట్లు సమాచారం. హైదరాబాద్, వరంగల్‌ రేంజ్‌లలో ఉన్న 1995 బ్యాచ్‌ అధికారులకు సమన్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు