ఉచిత మందులపై అవగాహన కల్పించండి

25 Jul, 2018 13:49 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె ధనంజయరెడ్డి  

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు ఉచితంగా అందజేస్తున్న మందులపై మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి సూచించారు. ఉద్దానంలో మందుల పంపిణీ అవగాహనా కార్యక్రమాల నిర్వహణపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బయట మార్కెట్‌లో మందులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక భారం పడుతుందని వివరించాలన్నారు.

ప్రస్తుతం 22 రకాల మందులను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రత్యేకంగా మరో ఆరు రకాలు ఉండాలని, వీటిలో ఒక రకాన్ని ఈ వారం నుంచి అందజేస్తామని పేర్కొన్నారు. వీటిపై గ్రామస్థాయిలో కమిటీలు వేసి, ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల అధికారులు ఆయా ప్రాంతాల ప్రైవేటు వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కలిగించాలని తెలిపారు.

ప్రతి పంచాయతీ స్థాయిలో నోడల్‌ అధికారిని ఏర్పాటుచేసి ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు.  కిడ్నీకి వ్యాధి గ్రస్తులకు శుద్ధ జలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏడు మదర్‌ ఆర్వో ప్లాంట్లు, ఏడు మండలాల్లో 128 గ్రామాలకు చెందిన 1,89,010 మంది జనాభాకు ప్రయోజనం చేకూర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.

జిల్లాకు నెఫ్రాలజిస్టులను ఆహ్వానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 పి.రజనీకాంతరావు, డీఆర్‌డీఏ పీడీ జి.సి.కిషోర్‌కుమార్, డీసీహెచ్‌ డాక్టర్‌ బి.సూర్యారావు, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సునీల్‌ నాయక్, అడిషినల్‌ డీఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ వై.వెంకటేశ్వరరావు, ఇమ్యూనైజేషన్‌ అధికారి బి.జగన్నాథరావు, గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజినీరు టి.శ్రీనివాసరావు ఉన్నారు.

మరిన్ని వార్తలు