అద్దె ఇళ్లలో ప్రభుత్వ బడులు

30 Nov, 2014 02:36 IST|Sakshi

మంచిర్యాల సిటీ : ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లు డి నోట్లో శని’ అన్న చందంగా ఉంది మంచి ర్యాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. సరిపడా నిధులున్నా సంబంధిత అధికారులు స్థలం కేటాయించకపోవడంతో పట్టణంలోని ఐదు ప్రాథమిక పాఠశాలలను అద్దె ఇళ్లలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.

పాఠశాలల తోపాటు ఎంఈవో, డెప్యూటీ ఈవో కార్యాల యాలకు సైతం శాశ్వత భవనాలు లేక  ఇరుకు గదుల్లోనే నెట్టుకొస్తున్నారు. పాఠశాలలకు ఏటా ఆర్‌వీఎం నుంచి నిధులు మంజూరవుతున్నా అధికారులు స్థలం కేటాయించకపోవడం తో అవి తిరిగి వెనక్కిమళ్లిపోతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి స్థలం మంజూరు చేస్తే పక్కా భవనాలు నిర్మించుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

2006 నుంచి అద్దె గదుల్లోనే
చెన్నూర్ రోడ్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2006లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాఠశాల అద్దె గదుల్లోనే కొనసాగుతోంది. ఇందులో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండగా 112 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు.

స్థలం లేక..
స్టేషన్ రోడ్డు ప్రాథమిక పాఠశాల 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రస్తుతం తరగతులు నిర్వర్తిస్తున్న అద్దె భవనం రెండోది. ప్రభుత్వం నుంచి సకాలంలో అద్దె మంజూరు కాకపోవడంతో యజమాని ఏడాది కిందట గదులకు తాళం వేశాడు. అయినా స్థలం మంజూరు కాలేదు. ప్రస్తుతం 1 నుంచి 5 తరగతి వరకు 81 విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు.      

2002 నుంచి మసీదులో..
2002 నుంచి ఇస్లాంపుర కాలనీలోని ఉర్దూ ప్రా థమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతి వరకు ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నాడు. 38 మంది విద్యార్థులకు పాటాలు చెబుతున్నాడు. స్థానిక మసీదులో పాఠశాల కొనసాగడం విశేషం.

రెండు గదుల్లో..
జాఫర్‌నగర్‌లో 2001లో ఉర్దూ ప్రాథమిక పాఠశాలను రెండు అద్దె గదుల్లో ప్రారంభించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంది. 33 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయురాలే పాఠాలు చెబుతోంది.  
 
వరండాలోనే..
రాళ్లపేట ప్రాథమిక పాఠశాల 2004 ఏర్పడింది. ఒకటి నుంచి ఐదో వరకు ఉండగా 55 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క ఉపాధ్యాయురాలే ఉంది.  అద్దెకు గదులు దొరకకపోవడంతో ప్రస్తుతం ఓ ఇంటి వరండాలో తరగతులు నిర్వర్తిస్తున్నారు.
 
ప్రతిపాదనలు పంపించాం
 ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎంఈవో కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఇప్పటికీ మూడు సార్లు నివేదికలు పంపించాం. డీఈవోతోపాటు, కలెక్టర్, ఆర్‌వీఎం పీవోకు నివే దికలు పంపుతున్నాం. అద్దె గదుల్లో నిర్వహిస్తున్న పాఠశాలలకు స్థలం మంజూరు కాకపోవడంతో వచ్చిన నిధులు వెనక్కిమళ్లిపోయాయి.

- బొమ్మ గణపతిరెడ్డి, మంచిర్యాల ఇన్‌చార్జి ఎంఈవో
 

మరిన్ని వార్తలు