నెల రోజుల్లో స్టీల్‌ బ్రిడ్జి రెడీ

20 Apr, 2020 09:03 IST|Sakshi
పంజగుట్ట వద్ద పనులు పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్, మేయర్‌

మంత్రి కేటీఆర్‌

లక్డీకాపూల్‌ : పంజగుట్టలో రూ.23 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన స్టీల్‌ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు, నిర్మాణ సంస్థను మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. ఆదివారం మేయర్‌ బొంతు రామ్మోహన్, శాసన సభ్యులు దానం నాగేందర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి అర్వింద్‌ కుమార్‌లతో కలిసి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. రోడ్డు విస్తరణ చేసి నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జి గడ్డర్ల అమర్చే పనులను పరిశీలించారు.

లాక్‌డౌన్‌ వలన కలిగిన వెసులుబాటుతో అదనంగా కార్మికులను, నిపుణులను నియమించి రేయింబవళ్లు పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్‌ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ, ఆధునిక యంత్రాలతో మరో నెలరోజులలో పనులను పూర్తిచేయాలన్నారు. స్టీల్‌ బ్రిడ్జి, రెండు వైపులా రెండు లేన్ల విస్తరణ పనులు 50 శాతం పూర్తి అయినట్లు జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌ ఈ సందర్భంగా వివరించారు. నిత్యం రద్దీగా ఉండే పంజాగుట్ట మార్గంలో ప్రయాణించే వాహనదారుల ఇబ్బందులు మరో నెల రోజుల్లో పూర్తిగా తొలగిపోనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ మన్నె కవిత గోవర్ధన్‌రెడ్డి, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు