‘ఆ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి’ 

24 Jun, 2018 03:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చేప పిల్లల ఎంపికలో లోపాలుంటే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని మత్స్య, పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’లో ‘చేపా.. చేపా.. నీకేమైంది’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. దీనిపై మత్స్యశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు.

పత్రికలో పేర్కొన్న ప్రాంతాలకు ఉన్నతాధికారులను పంపి, వాస్తవ పరిస్థి తులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీని ఆధారంగా.. చేప పిల్లల ఎంపికలో ఏవైనా లోపాలుంటే.. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని స్పష్టం చేశారు. మత్స్యకారులు చేపలను విక్రయించేందుకు 140 చేపల మార్కెట్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని, అందులో 40 మార్కెట్లకు స్థల సేకరణ జరుగుతోందని తెలిపారు. చేపల విక్రయాల కోసం విస్తృతమైన మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు