హైదరాబాద్: తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు తిరిగి కొనసాగనున్నాయి. ప్రభుత్వంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు సోమవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్టు ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు తెలిపారు.
మంత్రి లక్ష్మా రెడ్డి హామీతో సమ్మె విరమించామని ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు వెల్లడించారు. ఆరోగ్య శ్రీ సేవలు యధావిధిగా కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం రూ.100 కోట్లు విడుదల చేసి, నెలాఖరులోగా మిగతా బకాయిలు చెల్లిస్తామన్నారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే సేవలు పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమిస్తున్నామని చెప్పారు. నెలాఖరులోగా మిగతా బకాయిలు చెల్లించకపోతే మళ్లీ సమ్మె చేస్తామని స్పష్టం చేశారు.