వరదలతో నాణ్యత దెబ్బతిందా?

2 Sep, 2018 01:53 IST|Sakshi

ఇంజనీర్లతో క్వాలిటీ కంట్రోల్‌ సీఈ ఆరా  

అన్నారం బ్యారేజీ సందర్శన

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీని శనివారం రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ బి.వెంకటేశ్వర్లు పరిశీలించారు. 15 రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా వరదలు రావడంతో బ్యారేజీ పిల్లర్ల వద్ద నీరు చేరి ఇసుక మేటలు వేసిన విషయం తెలిసిందే. వరదల కారణంగా బ్యారేజీ, గేట్ల నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఏమైనా సమస్య తలెత్తిందా అనే అంశంపై ఇంజనీర్లతో చర్చించారు.

ఎస్సారెస్పీ నిండితే ప్రవాహం ఇక్కడ పెరుగుతుంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.. అనే విషయాల గురించి తెలుసుకున్నట్లు సమాచారం. బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర కప్పి వేసిన ఇసుక మేటలను పరిశీలించి ఇంజనీర్లకు పలు సలహాలు, సూచనలు చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఆయన వెంట క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఈఈ రఘురాం, ఇరిగేషన్‌ ఈఈ మల్లికార్జున్‌ప్రసాద్, డీఈఈ యాదగిరి, ప్రాజెక్టు మేనేజర్‌ శేఖర్‌దాస్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు