సాక్షి, హైదరాబాద్: విధులు బహిష్కరించి పక్షం రోజులుగా ఆందోళన చేస్తోన్న పంచాయతీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ ఎస్కే జోషిలను కలసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఆందోళన చేస్తే శాశ్వతంగా ఉద్యో గం నుంచి తొలగిస్తామని బెదిరించడం అన్యాయమన్నారు. ఆందోళన చేస్తోన్న ఉద్యోగులతో సామరస్యంగా చర్చలు జరపాలని, బెదిరింపులకు పాల్పడితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ఒడిశా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును అనుసరించాలని సూచించారు.