జడ్జీల నియామకంలో రిజర్వేషన్లు కల్పించాలి

9 Aug, 2018 06:13 IST|Sakshi
బార్‌ కౌన్సిల్‌ సభ్యులతో కలసి అభివాదం చేస్తున్న ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్‌: హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ కోటా కల్పించాల ని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ  ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో సభ్యులుగా గెలుపొందిన బీసీలకు అభినందన సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. గత 70 ఏళ్లుగా న్యాయస్థానాల్లో మెజారిటీ తీర్పులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా వస్తున్నాయన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఈ వర్గాల అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీస్తున్నారని విమర్శించారు. చట్టసభల్లో రిజ ర్వేషన్లు లేకపోవడం వల్ల ఈ కులాలకు న్యాయం జరగడం లేదని అన్నారు.

పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. పంచా యతీరాజ్‌ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచాలని, ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. బార్‌ కౌన్సిల్‌కు ఎన్నికైన సిరికొండ సంజీవరావు, చలకాని వెంకట్‌ యాదవ్, శంకర్, డి.జనార్దన్, సునీల్‌ గౌడ్, ఫణీంద్ర భార్గవ్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ నాగుల శ్రీనివాస్‌ యాదవ్, కొండూరు వినోద్‌కుమార్, జనార్దన్‌ గౌడ్, విజయ్‌ ప్రశాంత్, కోల జనార్దన్, వేల్పుల బిక్షపతి, నర్సింహ గౌడ్, నీల వెంకటేశ్‌ జి.అంజి, అనంతయ్య, జైపాల్‌ ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు