బీసీ బిల్లు పెట్టాలి

17 Jun, 2019 02:28 IST|Sakshi
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆర్‌.కృష్ణయ్య తదితరులు  

కిషన్‌రెడ్డితో ఆర్‌.కృష్ణయ్య చర్చలు 

హైదరాబాద్‌ : పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆదివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.  ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఇంతవరకు అసెంబ్లీ, పార్లమెంటు గడప తొక్కని బీసీ కులాల వారికి నామినేటేడ్‌ పద్ధతిలో ఆంగ్లో ఇండియన్లకు ఇచ్చిన మాదిరిగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి, రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. పంచాయతీరాజ్‌ సంస్థలో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 50 శాతానికి పెంచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్ర, ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నీల వెంకటేష్, దాసు సురేశ్, సి.రాజేందర్, జి. అంజి, వేముల రామకృష్ణ, జి. కృష్ణ యాదవ్, నరేష్‌గౌడ్, బర్క కృష్ణ, మహేందర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు