పటాన్చెరు: మెదక్ జిల్లా తూప్రాన్లో ఈ నెల 14న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ రోడ్షొలో పాల్గొంటారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం మాజీ ఉపముఖ్యమం త్రి దామోదర రాజనర్సింహతో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. నిర్మల్ వెళ్లే రాహుల్కు మార్గమధ్యలో ఉన్న తూప్రాన్లో జిల్లా నేతలు ఘనస్వాగతం పలుకుతారన్నారు. ఇక్కడ రోడ్షో, బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని రైతాంగానికి భరోసా కల్పించేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ చేపట్టనున్న పాదయాత్రపై టీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి డి. శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి ఏమీ చేయలేదని ఈ రెండుపార్టీలు చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు.సోమవారం గాంధీభవన్లో ఆయన పార్టీ నేతలు గండ్ర వెంకట రమణారెడ్డి, మహేశ్లతో కలసి విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రూ.20 వేల కోట్లమేర భారంతో ఉచితవిద్యుత్ సరఫరా చేశామని, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రూ.60 వేల కోట్లతో పంటరుణాలను రద్దు చేసిందని గుర్తుచేశారు.