సాక్షి, హైదరాబాద్: రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ పంటల బీమా పథకాలను అమలు చేసేందుకు వ్యవసాయశాఖ బుధవారం నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 30 జిల్లాలను ఆరు క్లస్టర్లుగా విభజించి ఐదు ప్రైవేటు కంపెనీలకు పంటల బీమా అమలుచేసే బాధ్యత అప్పగించింది. ఒక్కో క్లస్టర్లో ఐదు జిల్లాలను చేర్చారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోని రైతులు ఇష్టమైతేనే బీమా తీసుకోవచ్చు. బ్యాంకు రుణాలు తీసుకునే రైతులు తప్పనిసరిగా పంటల బీమా ప్రీమియాన్ని చెల్లించాల్సిందే. పీఎంఎఫ్బీవై పథకంలో వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఎర్ర మిరప, ఉల్లిగడ్డ, నువ్వుల పంటలకు బీమా అమలుచేస్తారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బీమా మొత్తాన్ని ఖరారు చేస్తారు.