80 కిలోల గంజాయి పట్టివేత

24 Oct, 2019 04:43 IST|Sakshi

విశాఖ ఏజెన్సీ నుంచి కొన్నినెలలుగా యథేచ్ఛగా గంజాయి రవాణా

హైదరాబాద్, నిజామాబాద్‌ల్లో విక్రయాలు, నలుగురి అరెస్టు

వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌

సాక్షి, హైదరాబాద్‌: విశాఖ నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.15.2 లక్షల విలువచేసే 80 కిలోల గంజాయి, కారు, రూ.4,200ల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ వివరాలను నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ మీడియాకు తెలిపారు. సూర్యాపేట జిల్లా పెన్‌ పహాడ్‌ మండలం గుడెపు కుంట తండాకు చెందిన గుగులోతు సైదా నాయక్‌ అలియాస్‌ సైదా వృత్తి రీత్యా డ్రైవర్‌.

అదే జిల్లా నూతంకల్‌ మండలం తీక్యా తండాకు చెందిన లవుడ్య అనిల్‌ కూడా డ్రైవర్‌. వీరిరువురు స్నేహితులు. ఈ ఇద్దరి ఆదాయం అంతంత మాత్రమే కావడంతో రవాణా రంగంలో ఉన్న సమయంలో విశాఖకు చెందిన గంజాయి విక్రయదారులతో ఏర్పడిన సత్సంబంధాలను ఉపయోగించి ఎక్కువగా డబ్బులు సంపాదించాలని ప్రణాళిక వేశారు. ఇందుకు వీరి స్నేహితులు సూర్యాపేట జిల్లాకే చెందిన లకావత్‌ వినోద్, లకావత్‌ హుస్సేన్‌ల సహకారం తీసుకున్నారు. ఇలా వీరు విశాఖ జిల్లా దారకొండ మండలం కొత్తూరు ఏజెన్సీ ప్రాంతం నుంచి అతి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్, నిజామాబాద్‌లోని కొందరికి అతి ఎక్కువ ధరకు విక్రయిస్తూ డబ్బులు సంపాదించడం మొదలెట్టారు.  

ఐదువేల లాభానికి విక్రయిస్తూ...
విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి కిలో రూ.2 వేలకు కొనుగోలు చేసి తమ కొనుగోలుదారులకు దాన్ని రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. ఇలా కొత్తూరుకు చెందిన శివ నుంచి 80 కిలోల గంజాయిని కొనుగోలు చేసి కారు డిక్కీలో, సైడ్‌ డోర్‌లో, సీట్ల కింద పెట్టి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ, మీర్‌పేట పోలీసులు సంయుక్తంగా గాయత్రి నగర్‌లో తనిఖీలు చేపట్టి గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. ఆ వెంటనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టు ఎదుట హాజరుపరిచి జ్యుడీíÙయల్‌ రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు