‘మున్సిపల్‌’లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు

29 Jul, 2019 13:15 IST|Sakshi
యువకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న రఘునందన్‌రావు

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు

సాక్షి, తూప్రాన్‌: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం తూప్రాన్‌ పట్టణ పరిధిలోని తాతపాపన్‌పల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురు యువకులను బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పార్టమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడం టీఆర్‌ఎస్‌కు మింగుడుపడటంలేదని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకోనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కాగా ఎంఐఎంనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ కరీంనగర్‌లో చేసిన ప్రసంగం పై క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదిలా ఉంటే సీఎం సొంత నియోజకవర్గంలోని తూప్రాన్‌ పట్టణం అభివృద్ధిలో వెనుకంజలో ఉందన్నారు. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌లో చేసిన అభివృద్ధి తూప్రాన్‌లో ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. తూప్రాన్‌ జాతీయ రహదారికి అనుకొని ఉందని, ఇక్కడ గతంలోనే పరిశ్రమలు వచ్చాయని కాని అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. డీగ్రి కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో గట్టు అమర్‌గుప్త, నర్సింహారెడ్డి, సాయిబాబాగౌడ్, ప్రవీణ్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు