20న రాహుల్‌ గాంధీ రాక!

12 Oct, 2018 13:56 IST|Sakshi
కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న నేతలు 

సాక్షి, కామారెడ్డి : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 20వ తేదీన జిల్లాకు రానున్నారు. కామారెడ్డిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం కలెక్టర్‌ సత్యనారాయణను కలిసి, బహిరంగ సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. జిల్లా కేంద్రంలో సభ నిర్వహించడానికి మూడు స్థలాలను పరిశీలించాలని కోరినట్టు సమాచారం.

ఇందిరాగాంధీ స్టేడియం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, సీఎస్‌ఐ గ్రౌండ్‌లలో ఏదో ఒకదానిలో సభను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌ బిన్‌ హందాన్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంనుంచి విజయం సాధించేందుకు శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెల 30న భిక్కనూరునుంచి కామారెడ్డి వరకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితో రోడ్‌షో నిర్వహించారు.

రేవంత్‌ రోడ్‌షోతో క్యాడర్‌లో ఉత్సాహం వచ్చింది. అదే ఊపుతోని యోజకవర్గంలోని ఆయా మండలాల్లో షబ్బీర్‌అలీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇ దే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కామారెడ్డికి రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. రాహుల్‌ పర్యటన ఈ నెల 20న ఉంటుందని పార్టీ హైకమాండ్‌ నుంచి వచ్చిన సమాచారంతో జిల్లా కాంగ్రెస్‌ నేతలు సభాస్థలి అనుమతి కోసం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. రాహుల్‌ పర్యటనతో కాంగ్రెస్‌ పార్టీకి మరింత జోష్‌ వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు