మోక్షం కలిగేనా?  

21 Jun, 2019 10:29 IST|Sakshi
 రంగారెడ్డిగూడలోని రైల్వేగేట్‌ 

రైల్వే గేట్‌ వేసిన ప్రతిసారీ ఇబ్బందులు  

రాజాపూర్‌ వద్ద నిర్మించినట్లే రంగారెడ్డిగూడ వద్ద అండర్‌ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్‌ 

రైల్వే అధికారులకు వినతులు సమర్పించిన స్పందన కరువు!  

సాక్షి, రాజాపూర్‌: మండలంలోని రంగారెడ్డిగూడ శివారులో ఉన్న రైౖల్వేగేట్‌ వద్ద అండర్‌ బ్రిడ్జి లేక వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే గేట్లు ఉన్న స్థానంలో అండర్‌ వే నిర్మించి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. మండల కేంద్రం నుంచి మల్లేపల్లికి వెళ్లేదారిలో ఉన్నా రైల్వేగేట్‌ను తొలగించి దాని స్థానంలో అండర్‌ బ్రిడ్జి నిర్మించారు. ఇక్కడ నిర్మించినట్లుగానే రంగారెడ్డి గూడా వద్ద నిర్మిస్తారని అందరూ అనుకున్నారు.

కానీ ఇప్పట్లో అండర్‌ బ్రిడ్జికి మోక్షం లేనట్లేనని అనిపిస్తుంది. గతంలో రైళ్లు చాలా తక్కువగా తిరిగేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో రైళ్లు నడుస్తుండడంతో, ప్రతి సారి రంగారెడ్డిగూడ వద్ద ఉన్న గేట్‌ను వేయడంతో అటు నుంచి వెళ్లే కల్లేపల్లి, అగ్రహారం పొట్లపల్లి, గుండ్లపొట్లపల్లి తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అదనంగా డబుల్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు చకచక పనులు సాగుతున్నాయి. డబుల్‌ లైన్‌ పూర్తయితే మరిన్ని రైళ్లు తిరిగే అవకాశం ఉంది. దీంతో రంగారెడ్డిగూడవద్ద అండర్‌బ్రిడ్జిని ఖచ్చితంగా నిర్మించాల్సిన అవసరం ఎంతైన ఉంది. గతంలో రైల్వేశాఖ అధికారులు సర్వే నిర్వహించి అండర్‌ వే నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేశారు. ఇప్పటి వరకు పనులు మొదలు కాకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రైల్వే అధికారులకు వినతులు ఇచ్చాం 
రైల్వే గేట్‌ స్థానంలో అండర్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఇక్కడికి వచ్చిన అధికారులకు వినతులు ఇచ్చాం. అండర్‌ బ్రిడ్జి ఇక్కడ చాలా అవసరం. గ్రామసభలో కూడా తీర్మానం చేసి రైల్వేశాఖ అధికారులకు పంపిస్తాం. గొల్లపల్లి, రాజాపూర్, పెద్దాయపల్లి గ్రామాల వద్ద రైల్వేగేట్‌ల స్థానంలో నిర్మించినట్లుగానే రంగారెడ్డిగూడ వద్ద ఉన్న రైల్వేగేట్‌ స్థానంలో ఖచ్చితంగా అండర్‌ బ్రిడ్జిని నిర్మించి ప్రజల కష్టాలు తీర్చాలి. 
– జనంపల్లి శశికళ, సర్పంచ్, రంగారెడ్డిగూడ   

>
మరిన్ని వార్తలు