రైల్వే టిక్కెట్లు; తాజా అప్‌డేట్స్‌

29 May, 2020 20:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రైళ్లకు సంబంధించి ఇటీవల విధించిన నిబంధనలను రైల్వే మంత్రిత్వ శాఖ సవరించించింది. టిక్కెట్ల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ గడువును మళ్లీ 120 రోజులకు పెంచింది. అలాగే తత్కాల్‌ సేవలను పునరుద్ధరించింది. ఇది ఈనెల 31 తేదీ ఉదయం 8 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కరెంట్‌ బుకింగ్‌, తత్కాల్‌ కోటా సీట్ల కేటాయింపులు సాధారణ టైం టేబుళ్ల రైళ్లకు వర్తించే విధంగానే ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. (ప్రయాణికుల ప్రత్యేక రైళ్లు ఇవే)

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్న లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలు ప్రయాణికుల రైళ్లను నిలిపివేశారు. ఈ నెల 12 నుంచి 30 ప్రత్యేక రాజధాని రైళ్లను నడుపుతున్నారు. జూన్‌ 1 నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ 230 రైళ్లకు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ గడువును అంతకుముందు 30 రోజులకు పరిమితం చేయగా, తాజాగా ఈ నిబంధనను సవరించి 120 రోజులకు పెంచారు. అలాగే పార్సిల్‌, లగేజీ బుకింగ్‌కు కూడా అనుమతి పునరుద్ధరించారు. (కోవిడ్‌ టెన్షన్‌; గంటకో మరణం!)

విశాఖలో ఇలా..
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కడానికి వచ్చేవారు 8వ నంబరు ప్లాట్‌ఫాంకు రావాల్సి ఉంటుంది. 1వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తారు. విశాఖ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలు జూన్‌ 1న వైజాగ్‌ నుంచి బయలుదేరుతుంది. న్యూఢిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలు జూన్‌ 3 నుంచి పట్టాలెక్కుతుంది. హైదరాబాద్‌- విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్‌  జూన్‌ 1 నుంచి రాకపోకలు సాగించనుంది. విశాఖ- హైదరాబాద్‌ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ జూన్‌ 2 నుంచి పునఃప్రారంభమవుతుంది. రైలు బయలుదేరే సమయానికి 2 గంటలు ముందగానే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ఆహార ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలని తెలిపింది. (కార్మికుల రైలు బండికి ‘టైం టేబుల్‌’ లేదట!)

మరిన్ని వార్తలు