మురిసిన సిరిసిల్ల

3 Jun, 2019 07:35 IST|Sakshi

పాల వినియోగంలో చివరి స్థానంలో ఆదిలాబాద్‌  

పాలసేకరణ పెంచాలని తెలంగాణ విజయ డెయిరీ నిర్ణయం

పశుసంవర్థక శాఖ వార్షిక నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాల వినియోగంలో రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర తలసరి వినియోగం కంటే ఆ రెండు జిల్లాలు ముందుండటం గమనార్హం. కాగా ఆదిలాబాద్‌ జిల్లా మాత్రం చిట్టచివరి స్థానంలో నిలిచింది. పశుసంవర్థశాఖ విడుదల చేసిన 2018–19 ఆర్థిక ఏడాది పాలనా నివేదిక ప్రకారం రాష్ట్ర తలసరి పాల వినియోగం నెలకు 4.6 లీటర్లుగా ఉంది. జిల్లాల ప్రకారం చూస్తే అత్యధికంగా రాజన్న సిరిసిల్ల నెలకు 6.3 లీటర్ల తలసరి వినియోగంతో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా 5.5 లీటర్లతో రెండో స్థానంలో నిలిచినట్లు నివేదిక తెలిపింది. 

పాల ఉత్పత్తిలో దేశంలో 13వ స్థానం
ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్‌ మొదటిస్థానంలో ఉండగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాల సేకరణ 3.92 లక్షల లీటర్లు ఉండగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల లీటర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజయ డెయిరీ తన నివేదికలో తెలిపింది. 2025 నాటికి ఏకంగా 10 లక్షల లీటర్లు సేకరించి పురోగమించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు నివేదికలో స్పష్టంచేసింది. 

57,538 పాడి పశువుల పంపిణీ
సహకార డెయిరీలకు పాలు పోసే 2.13 లక్షల మంది రైతులకు పాడి పశువులను సబ్సిడీపై అందజేయాలని గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రూ. 1677 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 75%, ఇతర రైతులకు 50%సబ్సిడీపై పాడి పశువులను అందజేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 57,538 మంది పాడి రైతులకు గేదెలు, ఆవులను సబ్సిడీపై అందజేశారు.

మరిన్ని వార్తలు