135 కోట్లు సీజ్‌.. 250 కేసులు నమోదు

6 Dec, 2018 18:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలింగ్‌ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌ కుమార్‌ తెలిపారు. ఓటరు ఐడీకార్డులేనివారు..  ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని పేర్నొన్నారు. ఇప్పటికే వంద శాతం ఓటర్‌ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. గురువారం ఎన్నికల పోలింగ్‌, బందోబస్తు, పోలింగ్‌ కేంద్రాలు తదితర అంశాలపై రజత్‌ కుమార్‌ మీడియా సమావేశంలో చర్చించారు. మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్‌ జరుగుతుందని, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలవరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. నగదు, మద్యం పంపిణీపై చాలా ఫిర్యాదుల వస్తున్నాయన్నారు. ఇప్పటివరకు 135 కోట్లు సీజ్‌ చేశామని, 250 కేసులు నమోదు చేశామని తెలిపారు. 446 పోలింగ్‌ పర్యవేక్షణ బృందాలు సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కొత్తగా 20 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వివరించారు.  

గుర్తింపు కార్డులు ఇవే..
పాస్‌పోర్ట్, డ్రైౖవింగ్‌ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డ్, ఫొటోతో ఉన్న పెన్షన్‌ ధ్రువీకరణ పత్రం, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్‌ స్లిప్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఎన్‌పీఆర్‌కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్‌.

మరిన్ని వార్తలు