చెక్కు వెనక్కి ఇచ్చేసిన రాజీవ్‌, సుమ

21 Jun, 2018 14:21 IST|Sakshi
జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రాజీవ్‌, సుమ 

బాలానగర్‌ (జడ్చర్ల): మండలంలోని హేమాజీపూర్‌ గ్రామ పాఠశాలను సినీ నటుడు రాజీవ్‌ కనకాల, యాంకర్‌ సుమ దంపతులు బుధవారం సందర్శించారు. హేమాజీపూర్‌ శివార్లలో వారికి వ్యవసాయం పొలం ఉండగా వచ్చారు. ఈ సందర్భంగా వారు గతంలో పాఠశాలలకు ప్రొజెక్టర్, లాప్‌ట్యాప్‌లు బహూకరించగా వాటిని వారు పరిశీలించారు.

అనంతరం రాజీవ్‌–సుమ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందాలనే భావనతో రూ.లక్ష వ్యయంతో వీటిని అందజేశామన్నారు. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చిస్తున్నందున ప్రైవేటు పాఠశాలల్లో చేరి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఈ మేరకు సుమ, రాజీవ్‌తో పలువురు గ్రామస్తులు ఫొటోలు దిగారు.  

‘రైతు బంధు’ చెక్కు వెనక్కి..
హేమాజీపూర్‌ గ్రామ శివారులో తమకు ఉన్న భూమికి సంబంధించి సినీ నటుడు రాజీవ్‌కు ప్రభుత్వం నుంచి తాజాగా రూ.29 వేల విలువైన పెట్టుబడి సాయం చెక్కు అందింది. అయితే, తాను ఆర్థికంగా కొంత మేర స్థిరపడినందున రైతుల సంక్షేమానికి ఉపయోగించేలా చూడాలని కోరుతూ ఆ చెక్కును రాజీవ్‌ బుధవారం తహసీల్దార్‌ రాంబాయికి అందజేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌ మురళీదర్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ రమేష్, కరుణాకర్‌తో పాటుబాలానగర్‌ రైతు సమన్వయ కన్వీనర్‌ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.  

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో...
జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి బుధవారం రాజీవ్‌ కనకాల, సుమ దంపతులు వచ్చారు. భూమికి సంబంధించిన లావాదేవీల విషయంలో వారు కార్యాలయానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు