ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు

30 Oct, 2017 15:01 IST|Sakshi

యువ ఐపీఎస్‌లకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉద్బోధ

ఘనంగా పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌

సాక్షి, హైదరాబాద్: భారత నవనిర్మాణలో ఐపీఎస్‌లు భాగస్వామ్య కావాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 69వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువ ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారన్నారు. పనిలో కూడా ప్రతిభ చూపాలన్నారు. ఉగ్రవాదులు ఓ వైపు, సైబర్ దాడులు వంటి సవాళ్లను ఎదురుకోవాల్సి ఉందన్నారు. ప్రజలకు సాయం చేయడంలో ముందుండి కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా వారికి అండగా నిలవాలన్నారు. మంచి అధికారి ఉంటే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ అభివృద్దికి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఆయన ఈ సందర్బంగా ప్రకటించారు. 69 ఐపీఎస్ శిక్షణలో అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన యువ ఐపీఎస్‌లకు బహుమతులు అందజేశారు.

ఈ బ్యాచ్‌లో మొత్తం 136 మంది ఏపీఎస్ అధికారులు శిక్షణ పొందారు. వీరిలో మన దేశం నుంచి 122 మంది.. భూటాన్, నేపాల్, మాల్దీవుల నుంచి 14 మంది ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారున్నారు. అంతా ఉన్నత విద్యావంతులే. శిక్షణ పొందిన వారిలో ముగ్గురు మెడిసిన్, 75 మంది ఇంజనీరింగ్, ఏడుగురు ఆర్ట్స్, ఆరుగురు సైన్స్, ఇద్దరు కామర్స్, ముగ్గురు ఎంబీఏ, నలుగురు లా, ముగ్గురు ఎంఫిల్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన వారున్నారు. అత్యధికంగా ఇంజనీరింగ్ నుంచి 75 మంది ఎంపిక కావడం ఎస్వీపీఎన్పీఏ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ బ్యాచ్‌లో మొత్తం 21 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. ఈ బ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా మహారాష్ట్ర కేడర్‌ ఐపీఎస్ షమీర్ అస్లామ్ షేక్ ఎంపికయ్యారు. పాసింగ్ ఔట్ పరేడ్ కు అల్ రౌండర్ షమీర్ అస్లామ్ షేక్ పరేడ్ కమాండర్ గా వ్యహరించారు. ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ అందరిని అకర్షించింది. అకింత భావంతో పనిచేస్తామంటూ ఈ సందర్బంగా యువ ఐపీఎస్ లు ప్రతిజ్ఞ పూనారు.

సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఈ అకాడమీకి దేశంలోనే అత్యున్నత స్థానం ఉంది. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ కి ఎంపికైన ఐపీఎస్‌లకు విలువలతో కూడిన శిక్షణ ఇస్తోంది మన నేషనల్‌ పోలీస్‌ అకాడెమీ. ఈ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన ఎందరో ఐపీఎస్‌ అధికారులు.. కేంద్ర హోం డిపార్ట్ మెంట్ తో పాటు రాష్ట్ర హోంశాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీ ఏర్పడ్డ రోజు నుండి ఇప్పటి వరకు 68 బ్యాచ్‌ల్లో ఐపీఎస్‌లు ఎన్‌పీఏలో శిక్షణ పొందారు. ఇందులో ప్రతీ బ్యాచ్ కు 45 వారాల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. అందులో ఇండోర్ ఔట్ డోర్ తో పాటు సైబర్ క్రైం నేరాలు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఉగ్రదాడులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ట్రైనింగ్ ఇచ్చామని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ డోలే బర్మన్ అన్నారు. ఐపీఎస్‌లు అన్ని విభాగాల్లో 45 వారాల పాటు శిక్షణ పొందారన్నారు. ఏడాది పాటు వివిధ పోలీస్ స్టేషన్స్ లో అక్కడ పరిస్థితుల అవగాహన కల్పిస్తామని 2018, సెప్టెంబర్ లో నుంచి వీరంతా విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా ఈసారి శిక్షణ పొందిన ఐపీఎస్ ల్లో ఏడుగుర్ని ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించారు. ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారుల్లో సతీష్ కుమార్, సుమిత్ సునీల్, వకుల్ జిందాల్, రిషిత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ క్యాడర్‌కు పోతరాజు సాయి చైతన్య, రాజేష్ చంద్ర, శరత్ చంద్ర పవార్‌లను కేటాయించారు.

మరిన్ని వార్తలు