సీఏఏపై క్లారిటీ ఇచ్చిన రాం మాధవ్‌

3 Jan, 2020 20:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి దీని గురించి పూర్తిగా తెలియాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధమ్‌ అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ చట్టంపై కొంతమంది తెలియక.. కొంతమంది తెలుసుకోవాలని.. మరికొంత మంది తెలివి లేక పోరాడుతున్నాని వ్యాఖ్యానించారు. దేశంలో 90 శాతం మంది భారతీయులు సీఏఏను స్వాగతిస్తున్నారని వెల్లడించారు. మిగిలిన పది శాతం మందికి కూడా దీనిని స్వాగతించేలా అర్థం చేయాలనేదే తమ ఉద్దేశ్యమని తెలిపారు. భారత దేశంలో నివసిస్తున్న.. ఇక్కడే పౌరులుగా ఉన్న వారికి సంబంధించిన బిల్లు కాదని వివరించారు. పౌరసత్వ చట్టంలో అనేక క్లాజులు ఉన్నాయని, శరనార్థులు పక్క దేశం నుంచి వచ్చి దశాబ్దాల కాలంగా ఇక్కడే సెటిల్ అయ్యేవారి కోసమే ఈ చట్టమని స్పష్టం చేశారు. ఎన్నార్సీలో రిలీజియన్ అంశమే ఉండదని, సెక్యులర్ స్పిరిట్‌కు బీజేపీ కుట్టుబడి ఉందన్నారు. మానవత్వం అదరికీ సమానంగా ఉంటుందని, కాంగ్రెస్ నేతలు వారి చరిత్రనే చదవలేరు కానీ ఎన్నార్సీని ఏం చదువుతారని ఎద్దేవా చేశారు.

శరనార్థులకు పౌరసత్వం ఇవ్వాలని మొదటి ప్రధాని నెహ్రూనే చెప్పారని రాం మాధవ్‌ గుర్తు చేశారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించామని, అప్పట్లో బ్రిటిష్ పాస్ పోర్టు ఉన్న వారు ఉగాండా నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందన్నారు. భారతదేశం నుంచి బ్రిటన్ పాస్ పోర్టుతో ఉగాండా వెళ్ళిన వారికి ఇందిరా గాంధీ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించారన్నారు. రాహుల్‌ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ముస్లిం దేశాల్లో ఎక్కడా ముస్లింలు స్వేచ్ఛగా లేరని, భారతదేశంలో మాత్రమే స్వేచ్ఛగా ఉంటున్నారని పేర్కొన్నారు. బిల్లును రాష్ట్రాలు కాదు నేతలు వ్యతిరేకిస్తున్నారని అ‍న్నారు.

క్రిస్టియన్‌లు శరనార్థులుగా కేరళకు రాగా వారిని ఆదరించామని, ఎవరు వచ్చిన స్వాగతించడం మన రక్తంలోనే ఉందని ప్రస్తావించారు. 2014 డిసెంబర్ 31 ముందు వచ్చిన శరనార్థులకు ఈ చట్టం వర్తిస్తుందని, అవాస్తవాలతోనే ప్రజలు ఆస్థులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. అస్సాం చిన్న రాష్ట్రం అవ్వడం వలన అక్రమ వలసలు కొనసాగాయన్నారు.  ఉప ఎన్నికల్లో లక్ష కొత్త ఓటర్లు వచ్చారని, 1971 కటాఫ్ ఇయర్‌గా పెట్టామని తెలిపారు. అస్సామీలకు భాష, సంస్కృతిలో  పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. భారత్‌ రక్షణ కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. 

మరిన్ని వార్తలు