పంజగుట్ట: ప్రజలను మతం, మూఢనమ్మకాల పేరుతో దగాచేస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న బాగు గోగినేనిపై దేశద్రోహం కేసు పెట్టడం హేతువాద గొంతుకని నొక్కడమేనని పలువురు హేతువాదులు విమర్శించారు. ఆయనపై చేసిన ఆరోపణలు, బనాయించిన కేసులు ఏవీ చట్టంముందు నిలబడే స్థాయిలో లేవన్నారు. బాబు గోగినేని ‘బిగ్బాస్–2’ లో ఉన్నందున అతను ఎవ్వరికీ అందుబాటులో లేడని, అతను బయటకు వచ్చాక కేసుకు పూర్తిగా సహకరిస్తారని, అతనిపై అన్ని నిరాధార ఆరోపణలు చేశారని రుజువు చేస్తారన్నారు.
శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక జాతీయ కమిటీ కార్యదర్శి మాదివాడ రామబ్రహ్మం, వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణ్రెడ్డి, నటుడు కత్తి మహేష్, న్యాయవాదులు గాంధీ, జువ్వూరి సుధీర్ మాట్లాడారు. వీరనారాయణ అనే వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా బాబుపై కేసు వేశారని, కోర్టు ఆదేశాలతో మాదాపూర్ పోలీసులు అతనిపై రాజద్రోహం, దేశద్రోహం, నమ్మకద్రోహం, మోసం, మతాల మధ్య వ్యతిరేకతను రెచ్చగొట్టడం లాంటి కేసులు బనాయించారన్నారు. సీఆర్పీసీ 41 ప్రకారం నేరం మోపబడిన వ్యక్తి వివరణ తీసుకుని నేరం జరిగిందని తేలితేనే కేసు నమోదు చేయాలన్నారు. ఈ కేసుల వెనుక మతోన్మాద వ్యాపార మాఫియా ఉందన్నారు. బిగ్బాస్ నుంచి వచ్చాక బాబు పోలీసులకు పూర్తిగా సహకరించి కేసు నుంచి బయటపడతారని తెలిపారు.