మీకింత చాల్లే: ఆర్బీఐ

5 Dec, 2016 03:58 IST|Sakshi
మీకింత చాల్లే: ఆర్బీఐ
  •  రాష్ట్రానికి రూ. 15,000 కోట్లు సరిపోతాయన్న ఆర్‌బీఐ
  •  తగినంత నగదు సరఫరాపై విముఖత
  •  మరింత నగదు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి బుట్టదాఖలు
  •  ఇప్పటివరకు పంపింది కేవలం రూ. 13,800 కోట్లే
  •  మరో 1,200 కోట్లకు మించి పంపే అవకాశం లేనట్లే!
  •  ప్రజలు బ్యాంకు ఖాతాల్లో వేసింది రూ.45 వేల కోట్లు
  • సాక్షి, హైదరాబాద్
    రాష్ట్రానికి సరిపడినంత నగదు సరఫరా చేసేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విముఖత ప్రదర్శిస్తోంది. ప్రజలు నగదు నిల్వ చేసుకోవాల్సిన అవసరమేముందని కొత్త వాదన లేవనెత్తింది. ఇప్పుడున్న నగదు కొరతను తీర్చేందుకు సరిపడే చిన్న నోట్లను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పక్కనపెట్టింది. ఇప్పటివరకు రూ.13,800 కోట్ల విలువైన నోట్లను రాష్ట్రానికి పంపిణీ చేసిన ఆర్‌బీఐ...మరో 1,200 కోట్లకు మించి నగదు పంపకపోవచ్చని తెలుస్తోంది.
     
    రూ. 45 వేల కోట్లు జమ చేస్తే...
    పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడ్డ నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సొమ్ము రూ.45 వేల కోట్లు దాటింది. జమ చేసిన డబ్బుతో పోలిస్తే ఆర్‌బీఐ పంపిణీ చేసిన నగదు మూడో వంతు కూడా లేకపోవటం నోట్ల సంక్షోభానికి దారి తీసినట్లయింది. మరోవైపు పంపిణీ చేసిన నగదులో 96 శాతానికిపైగా కొత్త రూ. 2 వేల నోట్లు ఉన్నాయి. దీంతో రద్దయిన నోట్ల ప్రభావంతోపాటు మార్కెట్లో చిల్లర సమస్య  తీవ్రమైంది. అయినా దీన్ని పట్టించుకోనట్లుగా ఆర్‌బీఐ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

    రాష్ట్రానికి పది రోజుల కిందట రూ.5 000 కోట్ల విలువైన చిన్న నోట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆర్‌బీఐకి లేఖ రాయగా అందులో ఇప్పటివరకు రూ.1,800 కోట్లనే పంపిణీ చేసింది. పైగా కరెన్సీ కొరతను తేలికగా తీసుకుంది. ‘తెలంగాణకు రూ.15 వేల కోట్ల నగదు సరిపోతుంది.. అంతకు మించి అవసరాలుంటే ప్రజలు నగదు రహిత లావాదేవీలకు మొగ్గు చూపుతారు..’ అని ఆర్‌బీఐ ప్రతినిధులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమీక్షలోనే తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు సమాచారం.
     
    తమ వాదనను సమర్థించుకునే గణాంకాలను సైతం అదే సందర్భంగా వెల్లడించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ప్రస్తుతం రాష్ట్ర జనాభా 4 కోట్లు ఉండగా అందులో 2.5 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రానికి ఇప్పటికే రూ.12 వేల కోట్ల విలువైన నోట్లు పంపిణీ అయ్యాయి. అంటే సగటున ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున చేరినట్లే. ఆ లెక్కన నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో రూ.12 వేలు ఉన్నట్లే. అంతకు మించి నగదుతో అవసరం ఏముంటుంది. మిగతా లావాదేవీలు, ఎక్కువ ఖర్చులుంటే నగదు రహిత లావాదేవీలు, చెక్కులు, కార్డుల ద్వారా చెల్లించే వీలుంది కదా’ అని తమ వాదనను వినిపించారు. ఇప్పటివరకు ఆర్‌బీఐ రాష్ట్రానికి పంపిణీ చేసిన కొత్త నోట్లు, నగదు పంపిణీ జరుగుతున్న తీరు సైతం ఇదే విషయాన్ని కళ్లకు కట్టిస్తోంది.

మరిన్ని వార్తలు