జూపల్లి 119 కేంద్రంలో రేపు రీ పోలింగ్

18 May, 2014 00:34 IST|Sakshi

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్
 
 పాలమూరు,  మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం జూపల్లి గ్రామంలోని 119వ పోలింగ్ కేంద్రంలో ఈనెల 19న రీ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశించిందని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ శనివారం వెల్లడించారు. ఈవీఎంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఓట్ల లెక్కింపు ఆగిపోయిది. ఇందుకుగాను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 119వ పోలింగ్ కేంద్రం పరిధిలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. మొరాయించిన ఈవీఎంను పరిశీలించి తగిన చర్యలు చేపట్టేందుకు ఈసీఐఎల్‌కు చెందిన సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జెడ్.ఎ.ఖాన్, సీనియర్ ఇంజనీర్లు జైశ్వాల్ జిల్లా కేంద్రానికి వచ్చి కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ప్రవీణ్‌కుమార్ టోపో, కల్వకుర్తి నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులు వంశీచందర్‌రెడ్డి, టి.ఆచారి సమక్షంలో ఈవీఎంను పరిశీలించారు. ఈ విషయంలో పోలైన ఓట్లకు బదులు ఎర్రర్ చూపిస్తున్నందున విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదించారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రీపోలింగ్ జరపాలని  నిర్ణయించింది. కాగా, ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుండి అక్కడ ఎలాంటి ప్రచారం చేయకూడదు. దీంతో ఆ పోలింగ్ కేంద్రం పరిధిలో స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను, కేంద్ర ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
 
 పోలింగు కేంద్ర వివరాలు

 స్టేషన్ నెం: 119, జూపల్లి గ్రామం
 
 పోలింగు నిర్వహించాల్సిన ఓట్లు : 633
 ప్రస్తుత ఆధిక్యం: వంశీచందర్ రెడ్డి (కాంగ్రెస్)
 -వచ్చిన ఓట్లు 42,229 - ఆధిక్యం 32 ఓట్లు
 ద్వితీయ స్థానం: టి.ఆచారి (బీజేపీ) - 42,197
 తృతీయ స్థానం: జైపాల్‌యాదవ్ ( టీఆర్‌ఎస్)- 29,687
 

మరిన్ని వార్తలు