రియల్టీకి కరోనా కాటు

27 Mar, 2020 01:45 IST|Sakshi

నిన్న ఆర్థిక మాంద్యం.. నేడు వైరస్‌ ప్రభావం

సాక్షి, హైదరాబాద్‌ : మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితి. ఆర్థిక మాంద్యంతో అనిశ్చితిలో కొట్టుమి ట్టాడుతున్న స్థిరాస్తి రంగాన్ని కరోనా కాటేసింది. ప్రపంచవ్యాప్తం గా నెలకొన్న పరిస్థితులు రియల్టీపై ప్రభావం చూపనున్నాయి. ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడం తో అప్పటివరకు కనీసం అడుగు కూడా బయటపెట్టే పరిస్థితి లేదు. ఆ తర్వాత కూడా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడితే సరేసరి. ఇదే వాతావరణం కొనసాగినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో రియల్టీ రంగం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు.

6 నెలల నుంచి స్తబ్ధత
ఆర్థిక మాంద్యం స్థిరాస్తి రంగాన్ని కుదేలు చేసింది. గతేడాది అక్టోబర్‌ నుంచి భూముల కొనుగోళ్లు, స్థలాల క్రయ, విక్రయాలు పడిపోయాయి. పెరిగిన ధరలు కూడా రియల్టీపై ప్రభావం చూపాయి. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ సహా తెలంగాణలో పరిస్థితి కాస్త మెరు గ్గానే ఉన్నా కొనుగోలుదారులు వేచిచూసే ధోరణి అవలం బించడంతో స్థిరాస్తి వ్యాపారం చతికిలపడింది. ఈ ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతామని భావి స్తున్న తరుణంలో కరోనా వైరస్‌ దేశాన్ని చుట్టేసింది. దీంతో లాక్‌డౌన్‌ ప్రకటించడం ఇళ్ల నుంచి కాలు బయట మోపే పరిస్థితి లేకపోవడంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టినవారు లబోదిబోమంటున్నారు. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వాతావరణం కనిపించకపోవడంతో 4–5 నెలల్లోనే లేఅవుట్‌ లేదా డెవలప్‌మెంట్‌ చేసి పెట్టుబడులు రాబట్టాలనుకొనే వారిని వడ్డీల భారం నడ్డి విరచడం ఖాయంగా కనిపిస్తోంది.

రూ. 2 కోట్లు గగనమే!
ప్రభుత్వ ఆదాయార్జన శాఖల్లో ముఖ్యమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై కరోనా ప్రభావం పడింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి గండిపడుతోంది. స్థిరాస్తుల లావాదేవీలు, ఇతర డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతి నెలా ఖజానాకు రూ. 560 కోట్ల ఆదాయం వచ్చేది. సెలవులు పోను రోజుకు రూ. 23 కోట్ల మేర రాబడి లభించేది. ప్రస్తుతం రూ. కోటిన్నర మేర మాత్రమే వస్తోంది.  

మరిన్ని వార్తలు