బ్రాహ్మణులకు మాత్రమే .....

21 Jun, 2014 00:00 IST|Sakshi

నాగోలు: ‘బ్రాహ్మణులకు మాత్రమే ప్లాట్లు అమ్ముతాం. వృద్ధాశ్రమం, వేదపాఠశాల, గోశాల, ఆలయం కట్టిస్తాం. అందరూ బ్రాహ్మణులు ఉండే అగ్రహారం’ అని నమ్మించి లక్షలాదిరూపాయల డబ్బులు కట్టించుకుని ప్లాట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాడో ఓ రియల్ వ్యాపారి. దీంతో బాధితులు శుక్రవారం ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం...ఎల్లాప్రగడ ప్రభాకర్‌శర్మ వేదగాయత్రి అగ్రహారం (రాఘవేంద్ర రియల్‌ఎస్టేట్) కార్యాలయాన్ని న్యూనాగోలుకాలనీ రోడ్‌నెం.2లో ఏర్పాటు చేశారు.
 
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరి గ్రామం సర్వేనెం.698 నుంచి 713 వరకు సుమారు 30 ఎకరాల్లో ప్లాట్లను విక్రయించేందుకు వివిధ ఛానళ్లు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. ప్రభాకర్‌శర్మ మాటలు నమ్మిన పలువురు రూ.లక్షల్లో  చెల్లించి వేదగాయత్రిలో స్థలాలను కొనుగోలు చేశారు. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఇళ్లను నిర్మించేందుకు సిద్ధం కావడంతో స్థానికులు వచ్చి ఆపేశారు.
 
దాదాపు 30 ఎకరాల్లో 1700 మందికి ప్లాట్లు చేసి అమ్మాడు. ఇళ్లు కట్టించి రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇదేమనడిగితే ప్రభాకర్‌శర్మ బెదిరిస్తున్నాడంటూ పలువురు బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.10లక్షల వరకు చెల్లించినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు