రియల్ దోపిడీ

5 Dec, 2015 23:46 IST|Sakshi

భారీగా వెలిసిన అక్రమ వెంచర్లు
నాయకులు, అధికారుల అండతో అక్రమాలు
నష్టపోతున్న కొనుగోలుదారులు
ఎల్‌ఆర్‌ఎస్ తెచ్చిన తంటా
భారం రూ.20 కోట్లకుపైనే..  గజ్వేల్‌లోని ప్లాట్ల పరిస్థితి
గజ్వేల్:
రియల్ ఎస్టేట్ పేరిట దోపిడీ జరుగుతోంది. అధికారులు, నాయకుల అండదండలతో అక్రమంగా వెంచర్లు పుట్టుకొస్తున్నాయ. అడిగే వారు లేకపోవడంతో అడ్డగోలుగా ప్లాట్లను విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ తీసుకురావడంతో... రియల్ వ్యాపారులు తెలివిగా పక్కకు తప్పుకుంటున్నారు. ఆ భారమంతా కొనుగోలు దారులపై పడనుంది. ఒక్క గజ్వేల్‌లోనే అక్రమంగా వెలిసిన లేఅవుట్ల కారణంగా సామాన్యులపై సుమారు రూ.20 కోట్లకుపైగా భారం పడబోతోంది. సీఎం నియోజకవర్గంలోనే ఇంతటి దారుణ పరిస్థితి నెలకొంది.

 గజ్వేల్ మేజర్ పంచాయతీ 2012 జనవరిలో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయ్యింది. ఈ నగర పంచాయతీలో ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్‌పల్లి గ్రామ పంచాయతీలు విలీనం కావడంతో పరిధి పెరిగింది. ప్రస్తుతం నగర పంచాయతీలో ఇళ్ల సంఖ్య సుమారు 9వేలకుపైగా చేరుకోగా జనాభా 40 వేలకు చేరింది. ఈ ప్రాంతానికి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడం, ఈ ప్రాంతాన్ని దేశంలోనే బంగారు తునకగా మారుస్తానని శపథం చేయడంతో పరిస్థితులు మారిపోయాయి.

 వివిధ అభివృద్ధి పనుల్లో వేగం అందుకుంది. నగర పంచాయతీ పరిధిలో సీఎం ప్రకటించిన ‘రింగ్ రోడ్డు’ ఇవతలి భూములు బంగారమయ్యాయి. ఈ రోడ్డు నగర పంచాయతీ పరిధిలో మొత్తం 19 కి.మీటర్లు విస్తరించబోతున్నారు. ఇందుకోసం 140 ఎకరాల భూమిని సైతం సేకరిస్తున్నారు. ఇప్పటికే వివిధ పనుల కోసం రూ.90 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా రోడ్డు లోపల 4,850 ఎకరాలకు దశ మారిందనే చెప్పాలి. ఇదే అదునుగా ఈ అక్రమ వెంచర్లు భారీగా వెలుస్తున్నాయి. గజ్వేల్ మేజర్ పంచాయతీగా ఉన్న సమయంలోనూ అక్రమ వెంచర్లు ఉండగా... ప్రస్తుతం ఊపందుకుంది. మొత్తంగా ఇప్పటివరకు 57 వెంచర్లు ఉండగా ఇందులో రెండింటికీ మాత్రమే పూర్తిస్థాయి అనుమతులున్నాయి. ఇవేకాకుండా ఇటీవల కాలంలో మరికొన్ని వెంచర్లు వెలిశాయి. ఖాళీ జాగా కొనుగోలు చేసి అందులో హద్దులు పాతి వెంచర్ ప్రకటిస్తున్నారు. తమ వెంచర్‌కు అన్ని రకాల అనుమతులున్నాయని బురిడీ కొట్టిస్తూ ప్లాట్లను విక్రయిస్తున్నారు.

 అక్రమ ‘దందా’కు నాయకులు, అధికారుల అండ!
 ఓ వైపు సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను అభివృద్ధికి నమునాగా తీర్చిదిద్దడానికి తాపత్రయపడుతుంటే ఇదే అదనుగా నాయకులు మాత్రం భూ‘దందా’ల్లో నిమగ్నమయ్యారు. ఈ అక్రమాలకు నాయకులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గజ్వేల్‌లో అక్రమ వెంచర్ల వ్యవహారంపై తరచూ వివాదాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పలుసార్లు అక్రమ వెంచర్ల అంశం నగర పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లోనూ దుమారం రేపుతోంది. గతంలో ఇక్కడ టీపీఎస్‌గా పనిచేసిన వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు రాగా అతనిపై బదిలీ వేటు పడింది. ఇదిలావుంటే ప్రస్తుతం కూడా టౌన్‌ప్లానింగ్ అధికారులు అక్రమాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమకు ‘మామూళ్లి’చ్చే వెంచర్ల జోలికి వెళ్లకుండా.. మిగితా వెంచర్లలో హద్దు రాళ్లను తొలగిస్తూ హల్‌చల్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

 సామాన్యులపై రూ.20 కోట్లపైనే భారం...
 నగర పంచాయతీ పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్, రాజిరెడ్డిపల్లి, ముట్రాజ్‌పల్లి, సంగుపల్లి, సంగాపూర్ గ్రామాల్లో అక్రమంగా వెలిసిన 55 వెంచర్లలో సుమారు 375 ఎకరాల భూమి ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు 8 వేలకుపైగా ప్లాట్లు ఉన్నాయని తేలింది. నిజానికి ఈ వెంచర్లలో కూడా పార్క్‌కు వెంచర్‌లో పదిశాతం భూమి వదిలి పెట్టడంగానీ, రోడ్లను 30 ఫీట్లు రోడ్లకు వదిలిపెట్టడం జరగలేదు. అందువల్ల 120 గజాలున్న ప్లాటును రెగ్యులరైజ్ చేసుకోవాలన్నా... ప్లాటు రిజిస్ట్రేషన్ విలువలో 14 శాతం చెల్లించడమే కాకుండా బెటర్‌మెంట్, డెవలప్‌మెంట్, భవన నిర్మాణ అనుమతి ఫీజు, స్క్రూటినీ ఫీజు అన్నీ కలుపుకొని మొత్తంగా ఒక్కో ప్లాటుకు తక్కువలో తక్కువ రూ.25 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని నగర పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నగర పంచాయతీ పరిధిలో 8 వేల మేర ప్లాట్లు ఉన్నాయి. ఈ లెక్కన రూ.20 కోట్లకుపైగా సామాన్యులపై భారం పడనుందని అంచనా.   రెగ్యులరైజ్ చేసుకోవడం పేదలకు అనివార్యమవుతోంది.
 

మరిన్ని వార్తలు