భూమికి ‘రీచార్జ్‌’

28 Sep, 2017 01:54 IST|Sakshi

భూగర్భ జలాల పెంపునకు ‘రీచార్జ్‌ షాఫ్ట్‌’

65 గ్రామాల్లో అమలుకు భూగర్భ జల విభాగం ప్లాన్‌

నీటి లభ్యత తగ్గిన చోట రీచార్జ్‌..  

తర్వాత భూగర్భ వినియోగం ఎక్కువగా ఉన్న 1,358 గ్రామాల్లో..

ఒక్కసారి రీచార్జ్‌తో 500 మీటర్ల వరకు ప్రభావం..  

ఒక్కో షాఫ్ట్‌ ఏర్పాటుకు గరిష్టంగా లక్ష ఖర్చు

ఇప్పటికే నల్లగొండ జిల్లాలో చండూర్‌లో ఫలించిన ప్రయోగం

మానవ శరీరంలో నీటి శాతం పడిపోయి నీరసం వస్తే ఏం చేస్తాం.. పండ్ల రసాలు తాగుతాం, లేదా సెలైన్‌ బాటిల్‌ ఎక్కించుకుంటాం.. లేదంటే ఓ ఇంజెక్షన్‌ తీసుకుంటాం. అలా తిరిగి రీచార్జ్‌ అవుతాం. అదే భూగర్భంలో నీటి శాతాలు పడిపోతే ఏం చేయాలి.. ఏ విధంగా రీచార్జ్‌ చేయాలి.. అనే దానికి సమాధానమే ‘రీచార్జ్‌ షాఫ్ట్‌’.

ఇంచుమించు మనిషికి ఇచ్చే ఇంజెక్షన్‌ మాదిరే ఈ విధానం కూడా. భూగర్భంలోకి బోర్‌వెల్‌ ద్వారా నీరు పంపించి రీచార్జ్‌ చేస్తారు. రాష్ట్రంలో పడిపోతున్న భూగర్భ జలాలు, కొన్ని జిల్లాల్లో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడికి ఇది పరిష్కారం చూపుతుందని భూగర్భ జల విభాగం ఆశిస్తోంది. రాష్ట్రంలో మొదట 65 గ్రామాల్లో అమలు చేయాలని ప్రణాళికలు వేస్తోంది.     – సాక్షి, హైదరాబాద్‌

దిగుడు బావుల కంటే మేలు..
సాధారణంగా భూమి పొరల్లో మొదట మట్టి పొరలు, అనంతరం రాతి పొరలు ఉంటాయి. మట్టి పొరల్లో నీటి నిల్వ సామర్థ్యం అత్యంత ఎక్కువగా.. రాతి పొరల్లోని పగుళ్లలో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. రాతి పగుళ్లతో పోలిస్తే మట్టి పొరల్లో వంద నుంచి రెండు వందల రెట్లు అధికంగా నీటి లభ్యత ఉంటుంది. దిగుడు బావుల వల్ల మట్టి పొరల్లో ఉండే నీరంతా భూ ఉపరితలం వరకూ తేవచ్చు. వర్షం పడినప్పుడు ఎక్కువ నీటిని లభ్యతగా పెట్టుకోవాలంటే దిగుడు బావులతో సాధ్యమవుతుంది.

అయితే దిగుడు బావులకు వీలైనంత ఎక్కువ డ్రైనేజీ పరివాహకం (క్యాచ్‌మెంట్‌) ఉండాలి. అదీగాక దిగుడు బావులు పూర్తిగా రీచార్జ్‌ అయ్యే ప్రాంతాల్లో కాకుండా ఎత్తైన (అప్‌ల్యాండ్‌) ప్రాంతాల్లో ఉంటాయి. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బావులున్నా నీళ్లు లేవు. బావులతో రీచార్జ్‌ అయ్యే భూగర్భ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రీచార్జ్‌ షాఫ్ట్‌లను భూగర్భ జల విభాగం తెరపైకి తెచ్చింది.

దీని ద్వారా నేరుగా 60 మీటర్ల వరకు బోర్‌వేసి నీటి తరలించడం ద్వారా 500 మీటర్ల వరకు భూగర్భ ప్రాంతాన్ని రీచార్జ్‌ చేయవచ్చు. మామూలు రీచార్జ్‌ విధానాలతో 10 నుంచి 11 శాతం ఫలితాలుంటే ఈ విధానం ద్వారా 15 శాతం వరకు భూగర్భం రీచార్జ్‌ అవుతుంది. ఈ విధానం అమలులో భాగంగా ఒక్కో రీచార్జ్‌  షాఫ్ట్‌కు గరిష్టంగా రూ.లక్ష వరకు ఖర్చు వస్తోంది.

ఆ 1,358 గ్రామాలే టార్గెట్‌..
రాష్ట్రంలో భూగర్భ జలాలను ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. రాష్ట్రంలో 15 లక్షల బోర్లు ఉన్నట్లు ఓ అంచనా. ఏటా వాటి సంఖ్య పెరుగుతోంది. భూగర్భ జలాలను 45 శాతానికి మించి వినియోగించకూడదు. కానీ ప్రస్తుత వినియోగం 58 శాతంగా ఉంది. ఈ మేరకు రాష్ట్రంలో 1,358 గ్రామాలు భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తున్నట్లు భూగర్భ జల శాఖ రికార్డుల్లో నమోదైంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల్లో బోర్లు వేయడాన్ని, బావులు తవ్వడాన్ని నిషేధించింది.

దీంతో ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి కటకట ఏర్పడింది. వచ్చే వేసవికి మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీని దృష్ట్యా ఈ గ్రామాల్లో ఇప్పటికే చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. చెక్‌డ్యామ్‌లు ఉన్న ప్రాంతాల్లోనే రీచార్జ్‌ షాఫ్ట్‌ల ద్వారా భూగర్భ మట్టాలు పెంచే యత్నాలకు దిగింది. సెప్టెంబర్‌ చివరి వారం నుంచి 65 గ్రామాల్లో 181 రీచార్జ్‌ షాఫ్ట్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. రెండో విడతలో 550 గ్రామాల్లో గ్రామానికి 2 షాఫ్ట్‌ల చొప్పున 1,110 షాఫ్ట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

రీచార్జ్‌ ఎలా చేస్తారంటే..
భూగర్భ జల వినియోగం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఇప్పటికే చాలా చోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణం జరిగింది. నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో ఒక్కో చెక్‌డ్యామ్‌ పరిధిలో రెండు షాఫ్ట్‌లు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఎంపిక చేసిన చెక్‌డ్యామ్‌ పరిధిలో 20 నుంచి 60 మీటర్ల లోతు వరకు బోర్‌వెల్‌ వేస్తారు. 180 మిల్లీమీటర్‌ డయా ఉన్న పీవీసీ పైపునకు పూర్తిగా జౌళి సంచి మాదిరి రంధ్రాలు చేసి ఉంటాయి. ఈ పీవీసీ పైపు ద్వారానే నీరు భూగర్భంలోకి చేరుతుంది.

అయితే రీచార్జి చేయడానికి ఫిల్టర్‌ బెడ్‌ తరహా ఇంకుడు గుంతలు బోర్‌వెల్‌ చుట్టూ ఏర్పాటు చేయాలి. ఇంకుడు గుంతలో 1.50 మీటర్ల మట్టంతో 40 ఎంఎం కంకర నింపాలి. దానిపైన 0.75 మీటర్‌ మట్టంతో 200 ఎంఎం కంకర, దానిపైన 0.75 మీటర్‌ మట్టంలో ఇసుక నింపాలి. ఈ విధానం వల్ల భూమిలోకి చేరే నీరంతా ఫిల్టర్‌ అవుతుంది. ఈ మొత్తం విధానానికి రూ.60 వేల నుంచి రూ.లక్ష ఖర్చు అవుతుండగా, 500 మీటర్ల వరకు భూగర్భం రీచార్జ్‌  అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విధానం నల్లగొండ జిల్లాలోని చండూరులో విజయవంతమైంది. ఈ విధానం ద్వారా ఫ్లోరైడ్‌ శాతం కూడా చాలా తగ్గిందని పలు అధ్యయనాలు తేల్చినట్లు భూగర్భ జల వనరుల విభాగం డైరెక్టర్‌ లక్ష్మయ్య ‘సాక్షి’కి తెలిపారు.

భూగర్భ అతి వినియోగం ఉన్న మొదటి పది జిల్లాలు, గ్రామాలు..
సిద్దిపేట  175  , రంగారెడ్డి 120 , జగిత్యాల 116 ,నల్లగొండ 97 ,సంగారెడ్డి 89 ,యాదాద్రి 86 ,భూపాలపల్లి 82 ,మహబూబ్‌నగర్‌ 77 ,కరీంనగర్‌ 62,సిరిసిల్ల 57

మరిన్ని వార్తలు