పేలిన రెడ్‌మీ 5ఏ స్మార్ట్‌ఫోన్‌

21 Oct, 2018 10:59 IST|Sakshi
ముక్కలైన రెడ్‌మీ ఫోన్‌

త్రుటిలో తప్పిన ప్రమాదం

శాలిగౌరారం(తుంగతుర్తి) : శాలిగౌరారంలో శనివారం స్మార్ట్‌ఫోన్‌ పేలింది. యువకుడు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణపాయం తప్పింది. వివరాలు.. శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధిలోని మార్కెట్‌కాలనీకి చెందిన రావుల సురేశ్‌ అనే యువకుడు నాలుగు నెలల క్రితం నల్లగొండలోని ఓ ప్రముఖ మొబైల్‌ దుకాణంలో ఎంఐ(రెడ్‌మీ)–5ఏ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసి వినియోగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యాహ్నం సెల్‌ఫోన్‌ అకస్మాత్తుగా స్విచ్‌ఆఫ్‌ కావడంతో పాటు ఆ సెల్‌ఫోన్‌ నుం చి చిన్నపాటి శబ్దం వస్తుండడంతో ఆ సెల్‌ఫోన్‌ను చూపించేందుకని  వెంటనే మండలకేంద్రంలోని ఓ సెల్‌ఫోన్‌ రిపేర్‌షాపువద్దకు వెళ్లాడు.

తనషర్ట్‌ జేబులో నుంచి ఆ సెల్‌ఫోన్‌ను తీసి షాపులోని టేబుల్‌పై పెడుతుండగానే ఒక్కసారిగా సెల్‌ఫోన్‌ నుంచి మంటలు వచ్చాయి. గమనించిన సురేశ్‌తో పాటు షాపు నిర్వాహకుడు వెంటనే బయటకు పరుగెత్తుతుండగానే పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో చుట్టుపక్కల షాపుల నిర్వాహకులు ఏమి జరిగిందోనని భయాందోళనకు గురయ్యారు. సురేశ్‌ ఏ మాత్రం ఆలస్యం చేసినా అతని జేబులోనే ఆ సెల్‌ఫోన్‌ పేలి ఉండేది. ఒకవేళ అదే జరిగితే సురేశ్‌ ప్రాణానికే ముప్పు వాటిల్లేది. దీంతో సురేశ్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మండలకేంద్రంలో జరిగిన ఈ సంఘటన గంటల వ్యవధిలోనే ప్రజలకు తెలియడంతో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌ల వాడకంపై కొంత ఆందోళనకు గురయ్యారు.

మరిన్ని వార్తలు