నిత్యం 1.25 లక్షల టన్నుల బొగ్గు తరలింపు 

29 Jun, 2019 03:35 IST|Sakshi
రైల్వే–సింగరేణి మధ్య ఒప్పందపత్రాలు మార్చుకుంటున్న రెండు సంస్థల అధికారులు

రైల్వే–సింగరేణి మధ్య ఒప్పందం

కొత్త గనులకు వేగంగా రైల్వే లైన్‌ నిర్మాణం

వచ్చే ఏడాది సత్తుపల్లి నుంచి రైళ్లు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: బొగ్గు ఉత్పత్తి, ఎగుమతులను భారీగా పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే, సింగరేణి బొగ్గు గనుల సంస్థలు నడుంబిగించాయి. సంయుక్త కార్యాచరణకు సిద్ధమయ్యాయి. సింగరేణి గనుల నుంచి దక్షిణ మధ్య రైల్వే నిత్యం లక్ష టన్నుల బొగ్గును వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తోంది. సరుకు రవాణానే రైల్వేకు ఆయువుపట్టు అయినందున బొగ్గు తరలింపుపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారిస్తోంది. బొగ్గు తరలింపురూపంలో దక్షిణ మధ్య రైల్వే భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఇప్పుడు నిత్యం జరుగుతున్న లక్ష టన్నుల రవాణాను మరో 25 వేల టన్నుల మేర పెంచాలని భావిస్తోంది. సత్తుపల్లిలో గనిని ప్రారంభించనున్నందున అక్కడికి ప్రత్యేక రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నారు. భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు 53 కి.మీ. మేర నిర్మితమయ్యే ఈ లైన్‌ను దక్షిణ మధ్య రైల్వే–సింగరేణి సంస్థలు సంయుక్తంగా చేపడుతున్నాయి. ఇందుకు అవసరమయ్యే 340 హెక్టార్ల భూమి సేకరణకు గాను రూ.95 కోట్లను రైల్వే శాఖ భరిస్తోంది. లైన్‌ నిర్మాణానికి అవసరమయ్యే రూ.600 కోట్లను సింగరేణి భరిస్తోంది. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ఈ పనులు వచ్చే సంవత్సరం పూర్తికానున్నాయి. ఆ వెంటనే కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి, సరఫరాను ఈ రెండు సంస్థలు ప్రారంభించనున్నాయి. దీంతో బొగ్గు సరఫరాలో నిత్యం అదనంగా 25 వేల టన్నుల సామర్థ్యం కలుగుందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇది అటు సింగరేణి, ఇటు రైల్వే పురోగతికి కొత్త బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు.  

ఇక నుంచి 3 గంటల్లోనే లోడింగ్‌.... 
ప్రస్తుతం సింగరేణి గనుల నుంచి నిత్యం దాదాపు 20 నుంచి 25 వరకు సరుకు రవాణా రైళ్లు బొగ్గును తరలిస్తున్నాయి. కానీ, పాత పద్ధతుల్లో బొగ్గు లోడింగ్‌ జరుగుతుండటంతో ఈ సామర్థ్యాన్ని పెంచటం సాధ్యం కావటం లేదు. ఒక్కో రేక్‌ (రైలు) బొగ్గు లోడింగ్‌కు 12 నుంచి 18 గంటల సమయం పడుతోంది. వ్యాగన్లను నిలిపి అక్కడి నుంచి ఇంజిన్‌ వెళ్లిపోతుంది. లోడింగ్‌ తర్వాత మరో ఇంజిన్‌ కోసం చూడాల్సిన పరిస్థితి ఉం టోంది. దీంతో వేగంగా లోడింగ్‌ జరిగేలా తాజాగా 2 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. జూలై ఒకటి నుంచి ఇది అమలులోకి రానుంది. దీని ప్రకారం ఇంజిన్‌తో కూడిన రేక్‌ రాగానే వెంటనే లోడ్‌ చేసి పంపించాలి. ఇంజిన్‌ను మరో చోటికి పంపి, లోడింగ్‌ తర్వాత మరో ఇంజిన్‌ కోసం ఎదురు చూసే పనిలేకుండా, రేక్‌ రాగానే కేవలం 3 గంటల్లో లోడింగ్‌ పూర్తి చేసి పంపాలనేది ఒప్పంద సారాంశం. దీనివల్ల బొగ్గు రవాణా మరింత పెరిగి రెండు సంస్థలకు లాభం జరుగుతుందని అధికారులు చెబుతున్నా రు. శుక్రవారం రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ శివప్రసాద్, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జాన్‌ ప్రసాద్, సింగరేణి కాలరీస్‌ కం పెనీ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె.ఆల్విన్‌ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు